రాష్ట్రపతి భవన్ వద్ద భద్రత పెంపు, విజయ్ చౌక్ వద్ద కూడా.. జేఎన్యూ వీసీని తొలగించాలి: ఎంఎం జోషి
జేఎన్యూ విద్యార్థుల ఆందోళనతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి భవన్కు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అంబేద్కర్ భవన్ వద్ద అడ్డుకొన్నారు. దీంతో మిగతా విద్యార్థుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు రాష్ట్రపతి భవన్ వద్దకు చేరుకునే ప్రయత్నం చేస్తారనే భావించి రాష్ట్రపతి భవన్, విజయ్ చౌక్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
భద్రత కట్టుదిట్టం..
రాష్ట్రపతి భవన్, విజయ్ చౌక్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వద్ద కూడా భద్రతను పెంచారు. పెంచిన భద్రతా సిబ్బంది గురువారం రాత్రంతా కాపుగస్తారని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. జేఎన్యూ వీసీని సస్పెండ్ చేయాలని విద్యార్థులు రాష్ట్రపతి భవన్ ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసు అధికారులు సెక్యురిటీ టైట్ చేశారు. ఈ నెల 5వ తేదీన జేఎన్యూలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య గొడవ జరిగడంతో హై టెన్షన్ నెలకొన్న సంగతి తెలిసిందే.
వీసీని తొలగించాల్సిందే.
బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా జేఎన్యూ విద్యార్థులతో స్వరం కలిపారు. జేఎన్యూ వీసీ జగదీశ్ను పదవీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదివరకు వర్సిటీలో ఫీజు పెంపునకు సంబంధించిన సమస్యపై సహేతుకమైన విధానాలను అవలంభించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ జేఎన్యూ వీసీకి రెండుసార్లు సూచించిందని జోషి గుర్తుచేశారు. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ సిఫారసులనే వీసీ బేఖాతరు చేశారని పేర్కొన్నారు. దీంతో అతని వ్యవహారశైలి ఏంటో అర్థమవుతోందని చెప్పారు. వీసీని పదవీనుంచి తొలగించాల్సిందేనని జోషి స్పష్టంచేశారు.
ర్యాలీలో ఉద్రిక్తత
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన దాడులకు కారణం వైస్ చాన్స్లర్ ఎం జగదీశ్ కుమార్ అలసత్వమే కారణమని విద్యార్థులు ఆరోపించారు. వీసీని సస్పెండ్ చేయాలని రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా బయల్దేరారు. అయితే మధ్యలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులను అంబేద్కర్ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ పోలీసుస్టేషన్కు తరలించారు. తర్వాత విద్యార్థులను విడుదల చేసినట్టు జేఎన్యూ విద్యార్థి విభాగం ట్వీట్ చేసింది.