JNU Violence:లెఫ్ట్ ముసుగులో దాడి చేసింది ఏబీవీపీ వ్యక్తే... నిర్థారించిన ఏబీవీపీ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: జేఎన్యూలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘటన తర్వాత సోమవారం ఇదే ఘటనకు సంబంధించిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. లెఫ్ట్ వర్గాలు ఏబీవీపీపై కార్యకర్తలపై దాడి చేస్తున్నారనే వీడియో ఒకటి చక్కర్లు కొట్టింది. అయితే ఈ వీడియోలో దాడి చేస్తున్నట్లుగా కనిపించిన వ్యక్తి లెఫ్ట్ వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఏబీవీపీకి చెందిన వ్యక్తి కావడం ఆర్ఎస్ఎస్ను ఇరుకున పడేసింది. ఆ వీడియోను జేఎన్యూ వైస్ ఛాన్సెలర్ జగదీష్ కుమార్ రీట్వీట్ చేస్తూ ఆ సమయంలో ఓ పోస్టు కూడా రాశారు. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకునేందుకే కొందరు దాడులకు దిగారంటూ దీనికి నిదర్శనం ఈ వీడియోనే అంటూ వీసీ జగదీష్ కుమార్ పోస్టులో రాసుకొచ్చారు.
రెడ్ కలర్ జాకెట్ ధరించి దాడి చేసిన వ్యక్తి
వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఓ రెడ్ కలర్ జాకెట్ ధరించిన వ్యక్తి గ్రీన్ కలర్ జాకెట్ ధరించిన వ్యక్తిపై దాడి చేస్తుండటం వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ముందుగా ఓ జర్నలిస్టు ట్విటర్లో పోస్టు చేసి ఈ గొడవే జేఎన్యూలో హింసాకాండకు దారి తీసిందని రాశారు. లెఫ్ట్ పార్టీలకు చెందిన విద్యార్థులు ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేశారని అది కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో దాడులకు దిగారంటూ ఆయన రాసుకొచ్చారు. లెఫ్ట్ పార్టీలకు చెందిన విద్యార్థులు క్యాంపస్లో అడ్మిషన్ ప్రాసెస్ను నిలిపివేసేందుకు దాడులు చేశారని పోస్టు ద్వారా వివరించారు ఆ జర్నలిస్టు.
దాడి చేసింది ఏబీవీపీ వ్యక్తి శర్వేంద్ర కుమార్
ఈ వీడియో ప్రభుత్వ వార్తా ఛానెల్ ప్రసార భారతి ట్వీట్ చేయడంతో వైరల్గా మారింది. ఆ తర్వాత బీజేపీ నేత హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఐటీ హెడ్ మరియు కన్వీనర్ అయిన చేతన్ బ్రగ్తా, నేషనల్ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవియా, బీజేపీ అధికార ప్రతినిధి సురేష్ నకుహాలు ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించిన ఆల్ట్ న్యూస్ అసలు విషయం బయట పెట్టింది. రెడ్ జాకెట్లో ఉన్న వ్యక్తి ఏబీవీపీ సభ్యుడని ఆయన పేరు శర్వేందర్ కుమార్ అని ఈ న్యూస్ ఛానెల్ బయట పెట్టింది. జేఎన్యూలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో పీహెచ్డీ మూడో సంవత్సరం చదువుతున్నట్లుగా ఆ వార్తా ఛానెల్ వార్తను ప్రసారం చేసింది. ఇక రెడ్ జాకెట్ ధరించిన వ్యక్తి శర్వేందర్ కుమార్ అని జేఎన్యూ విద్యార్థులు నిర్థారించినట్లు ఆ వార్తా ఛానెల్ తెలిపింది. శర్వేంద్ర కుమార్ ఎస్ఐఎస్ స్టూడెంట్స్ వివేక్ పాండేను చితకబాదుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
శర్వేంద్ర ఏబీవీపీ సభ్యుడని నిర్థారించిన అధ్యక్షుడు దుర్గేష్
ఇదిలా ఉంటే జేఎన్యూ ఏబీవీపీ ప్రెసిడెంట్ దుర్గేష్ కుమార్ను ఘటనపై ఆరా తీయగా... ఈ హింసాత్మక ఘటనతో ఏబీవీపీకి సంబంధం లేదని చెప్పారు. అయితే వీడియోలో ఉన్న శర్వేందర్ కుమార్ను చూపించి అడుగగా శర్వేందర్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏబీవీపీకి చెందిన సభ్యుడే అని నిర్థారించాడు. అంతేకాదు స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో తనకు జూనియర్ అని తెలిపాడు. అయితే మరొకరిపై శర్వేందర్ కుమార్ ఎందుకు దాడి చేస్తున్నాడో తనకు తెలియదని దుర్గేష్ కుమార్ చెప్పారు.
ప్రభుత్వ ట్విటర్ హ్యాండిల్ కావడంతోనే రీట్వీట్ చేశాను
ఈ వీడియోను ఎలా రీట్వీట్ చేశారని వీసీ జగదీష్ కుమార్ను ప్రశ్నించగా తాను ప్రభుత్వ ట్విటర్ హ్యాండిల్స్ నుంచి వచ్చే ప్రతి పోస్టును రీట్వీట్ చేస్తానని ఎందుకంటే అవి ప్రభుత్వానికి సంబంధించినవని సమాధానమిచ్చారు. అంతేకాదు విచారణకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. నిందితులను గుర్తించడంలో ఈ వీడియో ఉపయోగపడుతుందని తెలిపారు.