క్యాంపస్ పై రాజకీయ ఆధిపత్యం వల్లేనా?: ఏబీవీపీ వర్సెస్ ఎస్ఎఫ్ఐ: మా పని కాదంటోన్న.. !
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ) విద్యార్థుల దాడి అనంతరం అందరి చూపులూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)పై నిలిచాయి. ఏబీవీపీ.. భారతీయ జనతా పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘంగా కొనసాగుతోంది. జెఎన్యూలో విద్యార్థులు, ఫ్యాకల్టీలపై దాడి వెనుక ఏబీవీపీ హస్తం ఉందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. ఆ సంఘం విద్యార్థి నాయకులు స్పందించారు.
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దశాబ్దకాలం నుంచి వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థుల ఆధిపత్య ఆధిక్యం. కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ.. జెఎన్యూపై ఏకచ్ఛాత్రాధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. జెఎన్యూను తమ ఆధీనంలోకి తీసుకుని రావడానికి ఏబీవీపీ ఇదివరకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. పైగా చాాలా సందర్భాల్లో బెడిసి కొట్టాయి.
Recommended Video
ఇలాంటి పరిస్థితుల్లో- పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, అల్లర్లు, హింసాత్మక వాతావరణాన్ని ఏబీవీపీ.. తనకు అనుకూలంగా మార్చుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని జెఎన్యూ విద్యార్థులపై దాడికి పాల్పడి ఉండటానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయని అంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలను అడ్డుగా పెట్టుకుని ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు.
తమపై వస్తోన్న ఆరోపణలు, విమర్శలను ఏబీవీపీ తోసిపుచ్చుతోంది. ఈ దాడులతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ దాడులకు వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘం భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ఎందుకు కారణం కాకూడదని ప్రశ్నిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా లబ్ది పొందడానికి వామపక్ష నాయకులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఏబీవీపీ నాయకులు ప్రత్యారోపణలు చేస్తున్నారు.