ఆ ముసుగు అమ్మాయి ఎవరో తెల్సిపోయింది..జేఎన్యూలో ట్విస్ట్.. వాట్సాప్, ఎఫ్బీకి హైకోర్టు నోటీసులు..
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో హింసాత్మక సంఘటనల వ్యవహారం ఊహించని మలుపుతిరిగింది. కేసుల దర్యాప్తులో ఢిల్లీ పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతోన్న వేళ.. ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 5న ముసుగులు వేసుకున్న దుండగులు వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై దాడిచేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు, అనుమానితుల మెసేజ్ల డేటాను భద్రపర్చాలంటూ వాట్సాప్, గూగుల్, ఫేస్ బుక్ సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
పోలీసులకూ నోటీసులు..
జనవరి 5 నాటి దాడిని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి.. అంతకు ముందు జరిగిన ఘటనలపైనే ఢిల్లీ పోలీసులు ఫోకస్ పెట్టారని, తద్వారా ఎంక్వైరీ జరుగుతోన్న తీరు అనుమానాస్పదంగా ఉందంటూ జేఎన్యూకే చెందిన ముగ్గురు టీచర్లు(అమిత్ పరమేశ్వరన్, శుక్లా సావంత్, అతుల్ సూద్) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నిందితులు తప్పించుకోండా ఉండేలా సంబంధిత టెక్నికల్ ఆధారాలను భద్రపర్చేలా ఆదేశాలివ్వాలని కోరగా.. ఆ మేరకు కోర్టు గూగుల్, వాట్సాప్, ఫేస్ బుక్ లకు నోటీసులిచ్చింది. అలాగే ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ ప్రభుత్వాలకు కూడా సమన్లు జారీచేసింది.
వాట్సాప్ లోనే హింసకు ప్లాన్..
జేఎన్యూ హింసకు సంబంధించి రెండు వాట్సాప్ గ్రూపులను కేంద్ర బిందువులుగా పోలీసులు గుర్తించారు. ‘‘యూనిటీ అగెనెస్ట్ లెఫ్'', ‘‘ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్''పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లోనే దాడికి ప్లాన్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో జేఎన్యూ విద్యార్థులతోపాటు బయటి కాలేజీలకు చెందినవాళ్లు కూడా సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ సంభాషణలతోపాటు సీసీటీవీ ఫుటేజీ రికార్డులపైనా హైకోర్టు ఆరాతీసింది. వర్సిటీలో మొత్తం 135 సీసీటీవీ కెమెరాలున్నాయని, వాటి రికార్డుల కోసం యాజమాన్యానికి లేఖరాశామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ముసుగు అమ్మాయి ఔట్ సైడర్..
జేఎన్యూలో విద్యార్థులపై దాడి జరిగిన రోజు నుంచీ ముసుగు ధరించిన అమ్మాయి ఫోటో వైరలైన సంగతి తెలిసిందే. అబ్బాయిలతో కలిసి ఆయుధాలతో దూసుకొచ్చిన ఆ అమ్మాయి ఎవరనేది చర్చనీయాంశమైంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు ఆమెను కనిపెట్టగలిగారు. సదరు ముసుగు అమ్మాయి.. జేఎన్ యూ విద్యార్థిని కాదని.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే దౌలత్ రామ్ కాలేజీ విద్యార్థిని అని తేల్చేశారు. ఇవాళో రేపో ఆమెకు నోటీసులు జారీచేసే అవకాశమున్నట్లు తెలిసింది.
కొనసాగుతోన్న విచారణ
జనవరి 5 కంటే ముందు వర్సిటీలో కొంత మంది విద్యార్థులపై లెఫ్ట్ సంఘాల నేతలు దాడి చేసిన వ్యవహారంపై ఢిల్లీ పోలీసుల విచారణ కొనసాగుతోంది. జేఎన్ ఎస్ యూ ప్రెసిడెంట్ ఐషే ఘోష్ తోపాటు ఎనిమిది మందికి పోలీసులు నోటీసులిచ్చారు. సెమిస్టర్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ లెఫ్ట్ వింగ్ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారడం, వర్సిటీ సర్వర్ గదిని ధ్వంసం చేయడం తెలిసిందే. ఆ గొడవల కొనసాగింపుగానే లెఫ్ట్ విద్యార్థులు, వాళ్లకు మద్దిస్తోన్న టీచర్లపై దాడులు జరిగాయి.