JNU అల్లర్ల ఎఫెక్ట్: విద్యార్థి సంఘం మహిళా నేతపై ఎఫ్ఐఆర్: బాధితులపైనే కేసు పెట్టారంటూ!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ)లో చోటు చేసుకున్న తాజా పరిణామాల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జెఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు ఐషే ఘోష్ మహిళా పోలీసు కానిస్టేబుళ్ల పట్ల అమర్యాదగా ప్రవర్తించారని, వారు తమపై దాడిని చేసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో ఆమెపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐషే ఘోష్ సహా మొత్తం 19 మందిపై కేసు పెట్టారు.
JNU Violence: ఢిల్లీ పోలీసులపై ముప్పేట దాడి: వారి తీరుకు సిగ్గుపడుతున్నా: సీనియర్ అడ్వొకేట్
జెఎన్యూ పరిపాలనా విభాగం ఉద్యోగులు కూడా ఐషే ఘోష్ పై ఫిర్యాదు చేశారు. అల్లర్లు చోటు చేసుకుంటున్న సమయంలో ఐషే ఘోష్ యూనివర్శిటీకి సంబంధించిన సర్వర్ రూమ్ లో అక్రమంగా ప్రవేశించారని, విలువైన సామాగ్రిని ధ్వంసం చేశారని లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్వర్ రూమ్ కాపలాగా ఉన్న మహిళా సెక్యూరిటీ సిబ్బంది పట్ల కూడా ఐషే ఘోష్ తో పాటు మరో 19 మంది దురుసుగా ప్రవర్తించారని, వారిపై దౌర్జన్యానికి దిగారని పేర్కొన్నారు.
ఐషే ఘోష్ సహా ఆమె వెంట 19 మంది విద్యార్థులు ఉన్నారని, ఉద్దేశపూరకంగా వారు సర్వర్ రూమ్ లోకి ప్రవేశించి, ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆప్టిక్ ఫైబర్ పరికరాలు, బయోమెట్రిక్ వ్యవస్థ, విద్యుత్ ప్యానెళ్లు, ఇతర విలువైన సామాగ్రిని పగుల గొట్టడం వల్ల యూనివర్శిటీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దీనితో పాటు సర్వర్ రూమ్ కు కాపలాగా ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డులను అసభ్య పదజాలంతో దూషించారని యూనివర్శిటీ పరిపాలనా సిబ్బంది తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఐషే ఘోష్ పై కేసు నమోదు చేయడం పట్ల విద్యార్థులు మండిపడుతున్నారు. బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో తలకు తీవ్ర గాయాలైన ఐషె ఘోష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. తలకు తీవ్రగాయమైన ఐషే ఘోష్.. ఎలా సర్వర్ రూమ్ విధ్వంసానికి పాల్పడగలరని ప్రశ్నిస్తున్నారు. యూనివర్శిటీ అధికారులు తమపై తప్పుడు కేసులు బనాయించి, భయపెట్టే ప్రయత్నానికి దిగారని ధ్వజమెత్తారు.