JNU Violence:వ్యతిరేక గళాన్ని నొక్కేస్తోన్న మోడీ సర్కార్: సోనియా ఫైర్
ఢిల్లీ: ఢిల్లీలోని జేఎన్యూ క్యాంపస్లో జరిగిన హింసపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పాటు విదేశాల్లో ఉన్న జేఎన్యూ పూర్వ విద్యార్థులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే క్యాంపస్లో జరిగిన హింసకు కారణం బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జేఎన్యూ ఘటనపై స్పందించారు.
JNU Violence:సీసీ ఫుటేజీల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
యువత నోళ్లను మోడీ సర్కార్ నొక్కేస్తోంది: సోనియా
విద్యార్థులు యువత నోళ్లను మోడీ సర్కార్ బలవంతంగా నొక్కేస్తోందని ధ్వజమెత్తారు. జేఎన్యూలో జరిగిన హింసాకాండపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రభుత్వమే ఈ పనిచేయించిందని ఆరోపించారు . ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గళం విప్పినా మోడీ సర్కార్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు సోనియాగాంధీ. ఇందులో భాగంగానే జేఎన్యూ క్యాంపస్లో విద్యార్థులపై, టీచర్లపై దాడులని గుర్తుచేశారు.
అయితే పోలీసులు..లేదంటే గూండాలు..
దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్లు కాలేజీలపై పోలీసులు ప్రతిరోజూ సోదాలు దాడులు చేస్తున్నారని సోనియాగాంధీ ఫైర్ అయ్యారు. ఒక వేళ పోలీసులు సోదాలు నిర్వహించకుంటే ఆ పనిని బయటి వ్యక్తులు నిర్వహిస్తూ అడ్డుకుంటున్న వారిపై దాడులకు దిగుతున్నారని సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. వీరంతా బీజేపీ మద్దతుదారులే అని ఆమె అన్నారు. విద్యార్థులకు యువతకు అందుబాటులో విద్యా ఉండాలని చెప్పిన సోనియాగాంధీ... మంచి ఉద్యోగం, భవిష్యత్తుపై భరోసా కలిగేలా ప్రభుత్వాలు మసులుకోవాలని సూచించారు.
విచారణకు ఇండిపెండెంట్ జ్యుడీష్యరీ వేయాలి
మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత గళం వినిపిస్తే చాలు వెంటనే వారికి సంబంధించిన వారు రంగంలోకి దిగిపోయి దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదని సోనియాగాంధీ గుర్తు చేశారు. జేఎన్యూలో జరిగిన ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సోనియాగాంధీ... విద్యార్థులు వారు కలలుగన్న భవిష్యత్తుకోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ఆదివారం జేఎన్యూలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పిన సోనియాగాంధీ ఘటనపై విచారణకు ఇండిపెండెంట్ జ్యుడీష్యరీ వేయాలని డిమాండ్ చేశారు.
ముంబై ఉగ్రదాడులను తలపించాయి: ఉద్ధవ్ థాక్రే
ఇదిలా ఉంటే జేఎన్యూలో విద్యార్థులు భయంతో బతుకుతున్నారని వారికి అక్కడ రక్షణ లేదనే భావనలో ఉన్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. జేఎన్యూలో ఆదివారం దాడులు చేసిన వారు దాడులు చేయించినవారు పిరికపందలని మండిపడ్డారు. ముసుగులు ధరించి దాడులు చేశారంటే వారు ఎంతలా భయపడ్డారో అర్థం అవుతుందని థాక్రే అన్నారు. మహారాష్ట్రలో విద్యార్థులు చాలా క్షేమంగా ఉన్నారని ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుడుతుందని చెప్పారు థాక్రే. జేఎన్యూలో దాడి ఘటన తనకు 2008 ముంబైలో ఉగ్రదాడులను గుర్తు చేశాయని చెప్పారు.