కేంద్రం ఆదేశాల మేరకే పోలీసులు మౌనం వహించారు: జేఎన్యూ ఘటనపై కేజ్రీవాల్
జనవరి 5వ తేదీన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరిగిన హింసాత్మక ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. క్యాంపస్లోకి ముసుగు ధరించిన వ్యక్తులు వచ్చి హింసాత్మక వాతావరణం సృష్టిస్తున్నప్పటికీ పోలీసులు చూస్తూ మౌనంగా ఉండిపోయారంటే దీని వెనక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులు మౌనంగా ఉండరని... వారిని మౌనంగా ఉండాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన మేరకే ఎలాంటి చర్యలకు దిగలేదని కేజ్రీవాల్ అన్నారు. హింస చెలరేగుతుండగా వాటిని ఆపాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వలేదని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.
JNU Violence:సీసీ ఫుటేజీల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
హింస చెలరేగుతోందని తెలిసినా ఆపొద్దని కేంద్రం నుంచి ఆదేశాలు ఉన్నప్పుడు పోలీసులు మాత్రం ఏమి చేయగలరు అని కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించకపోతే వారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది. అందుకే పోలీసులు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే కేజ్రీవాల్ పోలీసులను వెనుకేసుకు రావడం ఒక జిమ్మిక్కని ఢిల్లీలో ఎన్నికలు ఉన్నందునే ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
జనవరి 5వ తేదీ ఆదివారం రాత్రి కొందరు ముఖాలకు ముసుగులు ధరించి జేఎన్యూ క్యాంపస్లోకి ప్రవేశించి హింసను సృష్టించారు. కర్రలు, కట్టెలు, ఇనుప రాడ్లతో క్యాంపస్లోకి తెగబడి విద్యార్థులను, టీచర్లపై దాడి చేశారు. అంతేకాదు క్యాంపస్లో ఉన్న ఫర్నీచర్ను ఇతర క్యాంపస్ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో క్యాంపస్ పాలనావిభాగం వారు పోలీసులకు ఫోన్ చేయడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇక ఈ ఘటనలో 28 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు ఐషే ఘోష్ కూడా ఉన్నారు. ఘటన తర్వాత రెండు గంటల పాటు క్యాంపస్లో కేకలు పెడబొబ్బులు వినిపించాయి.
Delhi Chief Minister Arvind Kejriwal: Delhi Police kya kar sakti hai? Oopar se aadesh agar aayega ki aapko hinsa nahi rokni, law and order theek nahi karna hai to vo bichare kya karenge? Agar nahi manenge to suspend ho jayenge pic.twitter.com/HfZQKtxY13
— ANI (@ANI) January 9, 2020
జేఎన్యూలో నెలకొన్న హింస, విద్యార్థులు ప్రొఫెసర్లపై దాడులు జరుగుతున్న అంశంపై టీచర్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశం జరుగుతుండగా ముసుగు ధరించిన వ్యక్తులు క్యాంపస్లోకి ప్రవేశించి నానా బీభత్సం సృష్టించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంతేకాదు ఆ గుర్తు తెలియని వ్యక్తులు మూడు హాస్టల్స్లోకి ప్రవేశించి నానా బీభత్సం సృష్టించారు. దుండగులు కర్రలు కట్టెలు, ఇనుపరాడ్లు పట్టుకుని వెళుతున్న వీడియో ఫుటేజీలను కొన్ని వార్తా ఛానెళ్లు ప్రసారం చేశాయి. అయితే ఘటనకు పాల్పడింది ఏబీవీపీ అని జేఎన్యూఎస్యూ ఆరోపిస్తుంటే.... లెఫ్ట్ అనుబంధ విద్యార్థి విభాగం జేఎన్యూఎస్యూ అని ఏబీవీపీ ఆరోపించింది.