జేఎన్యూ హింసాకాండ : ఆ ముసుగులో ఉన్నది ఏబీవీపీ కోమల్ శర్మనే.. గుర్తించిన పోలీసులు..
ఇటీవల జేఎన్యూలో జరిగిన హింసాకాండ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ చేసిన పనే అని 'ఇండియా టుడే' స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ వీడియోల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు నిందితులను గుర్తించారు. ముసుగు మూకలో ఉన్న మహిళను ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కోమల్ శర్మగా గుర్తించారు. దౌలత్ రామ్ కాలేజీ విద్యార్థి అయిన కోమల్ శర్మ ఏబీవీపీ సభ్యురాలని నిర్దారించారు. జేఎన్యూ హింసాకాండకు సంబంధించి వైరల్ అయిన వీడియోల్లో.. కోమల్ శర్మ చెక్స్ షర్ట్,లైట్ బ్లూ స్కార్ఫ్ ధరించి చేతిలో కర్రతో కనిపించింది. సబర్మతి హాస్టల్లో మరో ఇద్దరు ముసుగు వ్యక్తులతో కలిసి అక్కడి విద్యార్థులను ఆమె బెదిరించడం అందులో స్పష్టంగా కనిపించింది.
ఏబీవీపీ సభ్యురాలే..
ఐపీసీ సెక్షన్ 160 కింద కోమల్ శర్మతో పాటు అక్షత్ అవస్తి,రోహిత్ షా అనే ఇద్దరికి నోటీసులు జారీ చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే వారి ఆచూకీ ఇంకా కనుక్కోవాల్సి ఉందని.. ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ చేసి ఉన్నాయని చెప్పారు. కోమల్ శర్మకు నోటీసులపై ఏబీవీపీ ఢిల్లీ స్టేట్ సెక్రటరీ సిద్దార్థ యాదవ్ను మీడియా సంప్రదించగా.. ఆమె గురించి తనకెలాంటి సమాచారం లేదన్నారు. కోమల్ ఏబీవీసీ సభ్యురాలేనని, అయితే సోషల్ మీడియాలో ఆమె వీడియో వైరల్ అయినప్పటి నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిందని అన్నారు. ఆమెకు నోటీసులు అందాయో లేదో తెలుసుకునేందుకు కూడా ఆమె కాంటాక్ట్లో లేదన్నారు.
విచారణ త్వరగా పూర్తి చేయాలని..
ఈ నెల ఐదో తేదీన అసలేం జరిగిందో ఏబీవీపీ కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోందని సిద్దార్థ యాదవ్ అన్నారు. తమ విద్యార్థులను చాలామందిని కొట్టినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. కోమల్ శర్మపై ఆరోపణల విషయంలో మరింత లోతైన విచారణ జరపాలన్నారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని.. ఒకవేళ దాడిలో కోమల్ పాత్ర లేదని తేలితే.. ఆమెపై పడిన మచ్చ తొలగిపోతుందని అన్నారు. ఒకవేళ ఆమె పాత్ర ఉన్నట్టు తేలితే.. అందుకు తగ్గట్టుగా చర్యలు ఉంటాయన్నారు.
మరో ఇద్దరు విద్యార్థులను విచారించిన సిట్
ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో విద్యార్థి రోహిత్ షా ఏబీవీపీకి చెందినవాడు కాదని.. ఆ ఆర్గనైజేషన్ చెబుతోంది. అంతకుముందు అవస్తీ కూడా ఏబీవీపీ సభ్యుడు కాదని చెప్పింది. కానీ ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్లో అవస్తీ,రోహిత్ షా ఇద్దరు దాడికి పాల్పడింది తామేనని అంగీకరించారు. మరో ఇద్దరు జేఎన్యూ విద్యార్థులు సుచేత తలుద్కర్,ప్రియా రంజన్లను కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మంగళవారం రెండు గంటల పాటు విచారించింది.
విద్యార్థుల వాంగ్మూలం
విచారణలో భాగంగా సిట్కు తాను ఒకటిన్నర పేజీ వాంగ్మూలాన్ని ఇచ్చినట్టు తలుద్కర్ వెల్లడించారు. ఘటన రోజు ఎక్కడున్నావని, ముసుగుల్లో ఉన్నవారిని ఎవరినైనా గుర్తించావా అని,గాయపడ్డ విద్యార్థుల వివరాల గురించి తనను ప్రశ్నించినట్టు చెప్పారు. జేఎన్యూ దాడిలో తన పాత్రను తలుద్కర్ ఖండించిందని పోలీసులు తెలిపారు. మరో విద్యార్థి రంజన్ సిట్ విచారణలో భాగంగా ఒక పేజీ వాంగ్మూలాన్ని సమర్పించినట్టు సమాచారం.