పెళ్లిరోజే దారుణం: భార్య, కూతురిని హత్య చేసిన టెకీ..
మైసూరు: భార్య, కూతురిని ఓ టెకీ గొంతు కోసి హత్య చేసిన సంఘటన మైసూరు శివారులోని బసవనహళ్లిలో వెలుగుచూసింది. తమ పెళ్లి రోజు నాడే ఆ టెకీ ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం. బుధవారం రాత్రి అతను హత్యలకు పాల్పడగా.. గురువారం సాయంత్రం ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ ఏమైంది?:
ప్రజ్వల్(43)-సవిత(39) భార్యాభర్తలు. వీరికి సించన(10) అనే కుమార్తె ఉంది. భార్యాభర్తలు ఇద్దరు చాలాకాలం బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు. కొంతకాలం క్రితం మైసూరు వచ్చి రూ.90లక్షలతో బసవనహళ్లిలో ఓ ఇల్లు కొనుక్కున్నారు. బెంగళూరులో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాక.. ప్రజ్వల్ స్థానికంగా వ్యాపారం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
విభేదాల వల్లే హత్య?
బుధవారం రోజు ప్రజ్వల్-సవితల 12వ పెళ్లి రోజు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. రాత్రి భార్య, కూతురు నిద్రపోయాక.. కత్తితో వారి గొంతు కోసి హత్య చేశాడు.
భార్యతో విభేదాల వల్లే హత్యలకు పాల్పడ్డానని పోలీసుల విచారణలో తెలిపాడు. హత్యానంతరం అదే ఇంట్లో గడిపిన ప్రజ్వల్.. గురువారం ఉదయం బయటకి వెళ్లి పురుగుల మందు డబ్బా తెచ్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
బావమరిదికి ఫోన్:
బయటకు వెళ్లేముందు తన బావమరిదికి ఫోన్ చేశాడు ప్రజ్వల్. ఇంటి వద్ద చిన్నపార్టీకి ఉంది రమ్మని సాయంత్రం 5గం.కి ఫోన్ చేశాడు. కానీ క్లినిక్ లో పని ఉన్న కారణంగా అతను రాలేనని చెప్పాడు. అదే రోజు రాత్రి 9గం.కి మరోసారి ప్రజ్వల్ అతనికి ఫోన్ చేశాడు. ఆ సమయంలో అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
ఆపై ఆత్మహత్యాయత్నం:
భార్య, శవాలను ఇంట్లో పెట్టుకునే ప్రజ్వల్ ఒక రోజంతా గడిపాడు. పురుగుల మందు డబ్బా తీసుకొచ్చాక.. దాన్ని మద్యంలో కలుపుకుని తాగాలనుకున్నాడు. కానీ దాని వాసన కారణంగా అతను ధైర్యం చేయలేకపోయాడు.
ఆ వెంటనే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో.. ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ప్రజ్వల్ ను ఆసుపత్రికి తరలించాక పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.