ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం మరో రకంగా సృష్టిస్తోంది: అరుణ్ జైట్లీ
Recommended Video
యూపీఏ హయాంలో సగటు ద్రవ్యోల్బణం 10శాతం ఉండగా ఎన్డీఏ హయాంలో అది 4.5 శాతానికి తగ్గిందన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. దీని బట్టి చూస్తే మధ్యతరగతి వారి ఖర్చులు పెరిగిపోయాయని అర్థం అవుతోందన్నారు. ఏడాదికి రూ.7.5 లక్షల నుంచి రూ.8 లక్షలు సంపాదిస్తున్నవారికే కాస్తో కూస్తో మిగులుతోందన్న అరుణ్ జైట్లీ... అందుకే ఏడాదికి రూ. 5 లక్షలు సంపాదిస్తున్న ప్రతిఒక్కరికీ టాక్స్ రిబేట్ కల్పిస్తున్నామని చెప్పారు. దీంతో కేంద్రంపై రూ.18వేల కోట్లు భారం పడిందన్నారు. ఆతర్వాత స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ రూ.4వేల కోట్లు ఉందని గుర్తు చేశారు.అయితే ఇందులో కొంతలో కొంతైనా పరోక్ష పన్నుల రూపంలో వెనక్కు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.12 వేల కోట్ల నుంచి రూ.14వేల కోట్లు పరోక్ష పన్నుల రూపంలో వచ్చే అవకాశం ఉందన్నారు అరుణ్ జైట్లీ.
టాక్స్ రెవిన్యూలు విస్తరించబడ్డాయని చెప్పిన అరుణ్ జెట్లీ, ఆదాయపు పన్ను శాఖ బేస్తో పాటు రిటర్న్స్ కూడా పెరిగాయి అని చెప్పారు. జీఎస్టీ కలెక్షన్లలో కూడా స్థిరత్వం వచ్చిందని జైట్లీ వెల్లడించారు. ఇక రైతుల కోసం తీసుకొచ్చిన కొత్త పథకంతో ప్రభుత్వంపై రూ.24వేల కోట్లు వ్యయం పెరిగిందన్నారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు మొత్తం ఒకే సారి బదిలీ అవుతాయా అన్న ప్రశ్నకు... ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు జైట్లీ వివరించారు. రిజర్వ్ బ్యాంకు వద్ద నిధులు ఏమేరకు ఉన్నాయో ముందుగా తెలుసుకుని ఆ తర్వాత ఏమి చేయాలన్నదానిపై ఆలోచిస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ నిధులను పరిగణలోకి తీసుకోలేదని జైట్లీ స్పష్టం చేశారు. అదే జరిగితే కచ్చితంగా అది బొనాంజానే అవుతుందని జైట్లీ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేదవారికి కనీస వేతనం ఇస్తామని ఆపార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇవ్వడాన్ని ఎలా చూస్తారన్న ప్రశ్నకు అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం ఎప్పుడూ హక్కులకు సంబంధించిన విషయాలనే పరిగణలోకి తీసుకుందని అయితే వాటిని ప్రాథమిక ఆదాయంతో సరిపోల్చలేమని చెప్పారు. ఇప్పటికే ఆధార్, ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీలతో ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆదాయం కాన్సెప్టును అమలు చేశామని వెల్లడించారు. ఇక ఉద్యోగాల కల్పనపై మాట్లాడిన జైట్లీ... ఉద్యోగాలు సృష్టించకుండా 12శాతం నామమాత్రపు వృద్ధిని ఆశించడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. అయితే తమ ప్రభుత్వం ఉద్యోగాలు మరో రకంగా సృష్టిస్తోందన్నారు.