సల్మాన్కు నిరాశ: విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పని సరి
జోధ్పూర్: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు సల్మాన్ ఖాన్. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతులు తీసుకోవాలని చెబుతూ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే ప్రతిసారీ ఇది సాధ్యపడక పోవడంతో కోర్టు అనుమతిని కాస్త సడలించాలని విదేశాలకు వెళ్లేందుకు ఉన్న కోర్టు శరతును ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే సల్మాన్ ఖాన్కు నిరాశే మిగిలింది. సల్మాన్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
జోద్పూర్ సెంట్రల్ జైలు నుంచి సల్మాన్ ఏప్రిల్ 7న బైయిల్ పై విడుదలయ్యాడు. అంతకుముందు కోర్టు సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 1998లో జోధ్ పూర్ లోని కంకని గ్రామంలో రెండు కృష్ణ జింకలను సల్మాన్ చంపాడనే ఆరోపణలు రుజువవడంతో కోర్టు సల్మాన్కు శిక్ష విధించింది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్లో ఉన్నాడు.
సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విన్న జడ్జి రవీంద్ర కుమార్ జోషి బెయిల్ మంజూరు చేస్తూ సల్మాన్ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. ఇక అప్పటి నుంచి విదేశాలకు వెళ్లాలంటే ముందుగా కోర్టు అనుమతి తప్పని సరిగా తీసుకుంటూ వస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఇక ప్రతిసారీ కోర్టుకు సమాచారం ఇవ్వడం వీలుకాక పోవడంతో సల్మాన్ ఖాన్ సడలింపు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. ఆయన తరుపున వాదించిన లాయర్, మహేష్ బోరా తన క్లయింటు తరుచూ విదేశాలు వెళ్లాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. త్వరలోనే కేసుకు సంబంధించి వాదనలు పూర్తి అవుతాయి కనుక ఇప్పుడే శాశ్వతంగా సల్మాన్ ఖాన్పై విధించిన శరతును ఎత్తివేయరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ప్రాసిక్యూషన్ వాదనల వైపే కోర్టు మొగ్గు చూపుతూ... సల్మాన్కు నిరాశ కలిగే తీర్పునిచ్చింది.