దటీజ్ ద బ్యూటీ ఆఫ్ కేరళ: బీజేపీ దారుణ ఓటమిపై బాలీవుడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్
ముంబై: జాన్ అబ్రహం..బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు, స్టార్ హోదా ఉన్న హీరో. ఆయన సినిమాల్లో దేశభక్తి అధికంగా కనిపిస్తుంటుంది. సత్యమేవ జయతే, పరమాణు, మద్రస్ కేఫె వంటి మూవీలు దీనికి ఉదాహరణ. తాజాగా బాట్లా హౌస్ సినిమాలో నటించారు. జన్మత: జాన్ అబ్రహం మలయాళీ. తండ్రి మలయాళీ క్రిస్టియన్.. తల్లి జొరాస్ట్రియన్. రాజకీయాలకు దూరంగా ఉండే నటుడిగా బాలీవుడ్ లో పేరున్న జాన్ అబ్రహం చాలాకాలం నుంచీ ముంబైలో నివసిస్తున్నారు. తాజాగా- రాజకీయాలపై పరోక్షంగా కొన్ని సెటైర్లు వేశారు. ప్రత్యేకించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్డీఏ కూటమిని దృష్టిలో ఉంచుకుని ఆయన విమర్శలు చేశారు.
శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై టీటీడీ కీలక నిర్ణయం?
గాడ్ హు లవ్డ్ మోటార్ బైక్స్ ఇన్ ముంబై అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఒకట్రెండు రాష్ట్రాలు తప్ప దేశవ్యాప్తంగా ఎన్డీఏ హవా, నరేంద్ర మోడీ ప్రభంజనం వీచింది. దక్షిణాదిన ఏపీ, తమిళనాడు, కేరళల్లో ఒక్క స్థానాన్ని కూడా చేజిక్కించుకోలేకపోయింది బీజేపీ. ఇదే విషయాన్ని కొందరు విలేకరులు ఆయనను ప్రశ్నించారు. జాన్ అబ్రహం సొంత రాష్ట్రం కేరళలో బీజేపీ ఒక్క సీటును కూడా ఎందుకు గెలుచుకోలేకపోయిందని, కేరళ.. మోడీఫైడ్ ఇంకా ఎందుకు కాలేదని ప్రశ్నించారు.
దీనికి జాన్ అబ్రహం తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. దటీజ్ ద బ్యూటీ ఆఫ్ కేరళ.. అంటూ బదులు ఇచ్చారు. కేరళలో ఎక్కడ చూసినా సర్వమత సమానత్వం కనిపిస్తుందని అన్నారు. కేరళలోని 14 జిల్లాల్లో దేవాలయాలు, మసీదు, చర్చీలు ఉంటాయని, ఏ ఒక్క మతాన్ని గానీ, కులాన్ని గానీ, మలయాళీలు ఆదరించరని చెప్పారు. అన్ని మతాలను మలయాళీలు గౌరవిస్తారని అన్నారు. మలయాళీలకు మతం గొడవలు, కులం విధ్వేషాలు అంటించడం అంత సులభతరం కాదని చెప్పారు. చాలాచోట్ల ఆలయాలు, మసీదులు, చర్చిలు పక్క పక్కనే కనిపిస్తాయని, అయినప్పటికీ..ఎలాంటి గొడవల జోలికి వెళ్లకుండా పరస్పరం గౌరవించుకుంటారని అన్నారు.
క్యూబా విప్లవ వీరుడు ఫిడెల్ క్యాస్ట్రో దివంగతుడైన తరువాత తాను కేరళకు వెళ్లానని, ఆ రాష్ట్రంలో ఎక్కడ చూసినా..క్యాస్ట్రోకు నివాళులు అర్పిస్తూ వాల్ పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్లు కట్టారని జాన్ అబ్రహం అన్నారు. ఇలాంటివి తాను మన దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ చూడలేదని చెప్పారు. మలయాళీల్లో వామపక్ష భావజాలం నరనరాన జీర్ణించుకుపోయిందనడానికి ఆ సంఘటనే ఓ ఉదాహరణ అని అన్నారు. చిన్నప్పుడు తాను కూడా వామపక్ష పుస్తకాలను చదివానని చెప్పారు. అలాంటి నాయకులు ఉండటం వల్లే కేరళ ఓ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని అన్నారు. అదే ఆ రాష్ట్ర గొప్పదనమని చెప్పారు. తాను మలయాళీనైనందుకు గర్వపడుతానని చెప్పారు.