నచ్చకపోతే వెళ్లిపోండి... లేదా కొత్త పార్టీ పెట్టుకోండి... సిబల్పై కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్.
కాంగ్రెస్లో అంతర్గత పోరు ముదురుతోందా... సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యలు పార్టీలో చిచ్చు పెట్టాయా... పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానంపై కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీలో దుమారం రేగుతోంది. నిన్నటికి నిన్న రాజస్తాన్ సీఎం,సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కపిల్ సిబల్ వ్యాఖ్యలను తప్పు పట్టగా.. తాజాగా కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సిబల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నచ్చకపోతే వెళ్లిపోండి...
'ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారో... అలాంటివాళ్లు విమర్శలను పక్కనపెట్టి వేరే పార్టీలో చేరవచ్చు. లేదా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. నిజానికి ఆ నాయకులంతా గాంధీల కుటుంబానికి చాలా దగ్గరివాళ్లు. ఏవైనా సమస్యలుంటే నేరుగా సోనియా గాంధీ,రాహుల్ గాంధీలతోనే మాట్లాడవచ్చు. ఆ స్వేచ్చ వారికి ఉంది..' అని అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.'ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వారికి నచ్చకపోతే... ఏ పార్టీ ప్రగతిశీలంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుందో ఆ పార్టీలోనే చేరాలి. లేదా కొత్త పార్టీ పెట్టుకోవాలి.
అంతే తప్ప కాంగ్రెస్ పట్ల ఇలాంటి బహిరంగ విమర్శలు చేసి... పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసే చర్యలకు పాల్పడవద్దు. గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం కలిగిన అలాంటి సీనియర్ నేతలు ఇలా అసలు వ్యవహరించకూడదు. పార్టీ విషయాలు మాట్లాడేందుకు పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి. లేదా పార్టీ అధినాయకత్వం ఎదుటే నేరుగా ఆ సమస్యల గురించి మాట్లాడేంత చొరవ వారికి ఉంది.' అని అభిప్రాయపడ్డారు.
ఎన్నికలప్పుడు ఎక్కడున్నారు...
బిహార్ ఎన్నికల్లో వైఫల్యం గురించి మాట్లాడుతున్న ఈ నేతలు... అసలు ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడున్నారని అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. పార్టీని ఉద్దరించాలని మాట్లాడేవాళ్లు మొదట గ్రౌండ్లో దిగి నిరూపించుకోవాలి. అసలు బిహార్ ఎన్నికల్లో పార్టీ కోసం వారు స్వచ్చందంగా ఏమైనా పనిచేశారా అని నిలదీశారు. కపిల్ సిబల్ వ్యాఖ్యలను రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(నవంబర్ 18) కూడా తప్పు పట్టిన సంగతి తెలిసిందే. అంతర్గత విషయాలను బహిరంగ చర్చకు పెట్టాల్సిన అవసరం లేదని.. ప్రతీ సంక్షోభం నుంచి కాంగ్రెస్ పుంజుకుంటూనే ఉందని అన్నారు. ఏ ఎన్నికల్లో ఓడినా కాంగ్రెస్ అధినాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో విశ్వాసం సడలలేదన్నారు.
కపిల్ సిబల్ ఏమన్నారు..
రెండు రోజుల క్రితం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీపై కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా భావించట్లేదని.. సంస్థాగత లోపాలు సరిదిద్దుకోకుండా పార్టీ పుంజుకోవడం అసాధ్యమని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని.. సీడబ్ల్యూసీ పదవులను నామినేటెడ్గా కాకుండా ప్రజాస్వామ్యబద్దంగా కట్టబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ప్రజలు కాంగ్రెస్ వద్దకు వస్తారని ఆశించలేమని... పార్టీయే ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు.