బీజేపీ అధికారంలోకి మీరంతా ఆ పార్టీతో చేయికలపండి: కాంగ్రెస్ నేత
కర్నాటకలో కాంగ్రెస్ నేత రోషన్ బేగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల క్రితం ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ వైపే మొగ్గు చూపడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలో పడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం సామాజిక వర్గం వారంతా ఆ పార్టీతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మెలగడం నేర్చుకోవాలని తన ముస్లిం సోదరులకు తాను పిలుపు ఇస్తున్నట్లు రోషన్ బేగ్ చెప్పారు.
అంటే ముస్లింలు బీజేపీతో చేతులు కలపాలనే ఉద్దేశంతో మీరు ఆ వ్యాఖ్యలు చేశారా అని మీడియా ప్రతినిధులు అడుగగా ... తప్పేముందన్నారు రోషన్ బేగ్. కర్నాటకలో కాంగ్రెస్ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క టికెట్ మాత్రమే ఇచ్చిందని అన్నారు.
ఒకే పార్టీకి నమ్మకంగా ఉండి పనిచేయకూడదని రోషన్ బేగ్ అన్నారు. ఒక పార్టీలో అవమానాలు భరిస్తూ ఉండలేమని చెప్పిన రోషన్... తాము కూడా సమాజంలో హుందాగా బతకాలని భావిస్తున్నట్లు చెప్పారు. ముస్లింలకు గౌరవం దక్కని చోట ఉండి పార్టీకి ఊడిగం చేయాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. ప్రేమతో తమ వైపు పిలుచుకుంటే వారితో ఉంటామని చెప్పిన బేగ్... అవమానించేలా వ్యవహరిస్తే వారితో ఎందుకు వెళ్లాలని గట్టిగా ప్రశ్నించారు.
అయితే కర్నాటకలో ప్రస్తుతం ముస్లింల పరిస్థితికి కారణం ఎవరై ఉంటారని ప్రశ్నించగా ... కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు అని నిర్మొహమాటంగా చెప్పేశారు బేగ్. అంతేకాదు గుండురావు ప్రచారంలో ఓటర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయారని దుయ్యబట్టారు. సిద్ధరామయ్య కూడా పెద్దగా చేసిందేమీ లేదని ఇద్దరికి ఇద్దరు విఫలమయ్యారని వెల్లడించారు. అంతేకాదు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయే నేతలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకోవాలని చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ రాదని తనకు ముందే అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కంటే ముందే తెలుసని చెప్పిన రోషన్ బేగ్... ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేజేతులా చేసుకున్న పనే అని విమర్శించారు.