గాడిలో పెట్టే వెళ్తా: ఇన్ఫోసిస్పై నందన్ నీలేకని, ‘26లో ఎంట్రీ.. 62లో రీఎంట్రీ’
నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇన్ఫోసిస్ సంస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకే తాను వచ్చానని ఇన్ఫీలో కొత్త చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇన్ఫోసిస్ సంస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకే తాను వచ్చానని ఇన్ఫీలో కొత్త చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దుతానని చెప్పారు. ఛైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఆర్ శేషసాయి స్థానంలో నీలేకని బాధ్యతలు చేపట్టారు.
భరోసా ఇచ్చిన నీలేకని
గురువారం ఇన్ఫోసిస్లోకి పునరాగమనం చేసిన తర్వాత మొట్టమొదటిసారి శుక్రవారం నందన్ నీలేకని ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తూ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవస్థాపకులకు, కంపెనీకి మధ్య స్థిరత్వం సంపాదించడమే లక్ష్యంగా తాను ఇన్ఫీసిస్లోకి అడుగుపెట్టినట్టు నిలేకని స్పష్టం చేశారు. కంపెనీని గాడిపెట్టిన అనంతరమే తాను ఇన్ఫీ నుంచి నిష్క్రమిస్తానని తెలిపారు. నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తన పాత్ర బోర్డు పర్యవేక్షణ, పాలన, పనితీరు పరంగా ఉంటుందన్నారు.
కొత్త సీఈఓ కోసం వేట
విశాల్ సిక్కా రాజీనామా అనంతరం ఆ పదవిలోకి తీసుకురాబోయే కొత్త సీఈవోగా కోసం కంపెనీ వెలుపల, లోపల వ్యక్తులను వెతుకుతున్నామని చెప్పారు. కొత్త సీఈవో అందరి వాటాదారులతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ.. టెక్నాలజీ పరంగా బలమైన పట్టు ఉండాలన్నారు. కొత్త సీఈవో ఎంపిక కోసం సెర్చ్ కమిటీని త్వరలోనే నియమిస్తామన్నారు.
బాధ్యత పూర్తి చేసి వైదొలుగుతా..
ఇన్ఫోసిస్ బోర్డుతో పనిచేసే కంపెనీ అని, వాటాదారులందరినీ సంప్రదించిన తర్వాత, కొన్ని రోజుల్లోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని నీలేకని తెలిపారు. నాన్-ఎగ్జిక్యూటివ్చైర్మన్గా తన ఎంపిక, బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని పేర్కొన్నారు. అవసరమైనంత కాలం ఇక్కడే ఉంటానని, ఒక్కసారి నా బాధ్యత నెరవేరాక కంపెనీ నుంచి వైదొలుగుతానని ఇన్వెస్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పారు.
నారాయణ మూర్తితో బంధం..
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తికి తాను గొప్ప ఆరాధకుడనని నందన్ నీలేకని చెప్పారు. భారత కార్పొరేట్ గవర్నెన్స్కు మూర్తి తండ్రిలాంటి వారని మూర్తి అభివర్ణించారు. పనాయా డీల్పై స్పందించిన నీలేకని, ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటానని, స్వల్పకాలికంగా కంపెనీ పనితీరులో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని చెప్పారు.
సంతోషమే..
క్లయింట్స్తో, డీల్స్తో సంస్థ చేసుకున్న న్యాయ ఒప్పందాలకు తాను కట్టుబడి ఉంటానని నీలేకని చె్పారు. ‘ఇన్ఫోసిస్కి మళ్లీ తిరిగిరావడం సంతోషంగా ఉంది. క్లయింట్లు, షేర్హోల్డర్లు, ఉద్యోగులు మొదలైన వారందరికీ ప్రయోజనాలు చేకూర్చేలా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా బోర్డులోని నా సహచర సభ్యులతో కలసి పనిచేస్తాను' నందన్ నీలేకని తెలిపారు.
26లో ఎంట్రీ.. 62లో రీఎంట్రీ
తాను మొట్టమొదటిసారి ఇన్ఫోసిస్లో 26ఏళ్ల వయస్సులో అడుగు పెట్టానని.. తర్వాత మళ్లీ 62ఏళ్ల వయస్సులు రీఎంట్రీ ఇస్తున్నట్లు నందన్ నీలేకని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.