కరోనాపై ప్రశ్నించిన జర్నలిస్టుకు సంకెళ్లు, డెమొక్రసీలో ఫోర్త్ ఎస్టేట్ విలువ ఇదేనా..?
పోర్ట్బ్లెయిర్: ప్రస్తుతం కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణాలకు తెగించి వైద్యసిబ్బంది పోలీసులు పారిశుధ్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అసలు కరోనావైరస్ ఏమేరకు ఉంది, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటి.. లోటుపాట్లు లాంటి అంశాలను ప్రపంచానికి తెలియజేయడంలో మీడియా ముందు వరసలో ఉంది. జర్నలిస్టులు కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రెడ్జోన్లు, హాట్స్పాట్లకు కూడా వెళ్లి రిపోర్టింగ్ ఇస్తూ తమ వృత్తిని నిర్వర్తిస్తున్నారు. తాజాగా కోవిడ్-19పై ఓ జర్నలిస్టు ట్విటర్ వేదికగా సంధించిన ప్రశ్నకు ఏకంగా ఆయన్ను అరెస్టు చేశారు. ఈ ఘటన అండమాన్లో చోటుచేసుకుంది.
అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో జుబేర్ అహ్మద్ అనే జర్నలిస్టును అరెస్టు చేయడం జరిగింది. కోవిడ్-19 పేషెంట్తో ఫోనులో మాట్లాడిన ఓ కుటుంబంను క్వారంటైన్కు ఎలా తరలిస్తారంటూ ట్విటర్ వేదికగా జుబేర్ అహ్మద్ ప్రశ్నించాడు. అయితే ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా జుబేర్ ట్విటర్లో ప్రశ్నించాడు. అండమాన్లోని హడ్డో పట్టణంలో ఓ కుటుంబం కోవిడ్ పేషెంట్తో ఫోనులో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడిన పాపానికి కుటుంబంను క్వారంటైన్కు తరలించారని ఆ పత్రిక ఏప్రిల్ 26న కథనం ప్రచురించింది. ఏప్రిల్ 27న ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ ట్విటర్లో పోస్టు చేశాడు. అదే రోజు సాయంత్రం జుబేర్ను పోలీసులు అరెస్టు చేశారు.
Can someone explain why families are placed under home quarantine for speaking over phone with Covid patients? @MediaRN_ANI @Andaman_Admin
— Zubair Ahmed (@zubairpbl) April 26, 2020
ఆ వెంటనే మరో ట్వీట్ కూడా జుబేర్ చేశాడు. కోవిడ్-19 పేషెంట్లతో కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఫోన్లో మాట్లాడొద్దని మాట్లాడితే వారందరినీ క్వారంటైన్కు తరలిస్తారని ట్వీట్ చేశాడు. ఫోన్ కాల్స్ ఆధారంగా వారిని గుర్తించి పోలీసులు క్వారంటైన్కు తరలిస్తున్నారని వెల్లడించాడు. ఇక ఏప్రిల్ 27న బాంబూ ఫ్లాట్ పోలీస్ స్టేషన్ నుంచి నలుగురు పోలీసులు వచ్చి జుబేర్కు నోటీసులు ఇచ్చారని అబర్దీన్ పోలీసు స్టేషన్కు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నట్లు ఆ పత్రిక ఎడిటర్ వెల్లడించారు. తనను పోలీసులు అరెస్టు చేసినట్లు జుబేర్ ఫోన్ చేసినట్లు ఆ పత్రిక ఎడిటర్ వెల్లడించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద జుబేర్పై కేసును నమోదు చేశాడు.
Recommended Video
కేవలం ట్విటర్ వేదికగా ప్రశ్నించినందకు అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు ఎడిటర్. చట్టంలో ఉన్నది ఒకటైతే అండమాన్లో అమలవుతున్నది మరొకటని ఎడిటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండమాన్లో తమకు కోవిడ్ పై సమాచారం కేవలం ట్విటర్ నుంచే వస్తుందని లేదంటే చీఫ్ సెక్రటరీ చేతన్ సంఘీ నుంచి వస్తుందని పత్రిక ఎడిటర్ చెప్పారు. అక్కడ ఎలాంటి మీడియా సమావేశాలు ఉండవని వెల్లడించిన ఎడిటర్ సమాచారం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు.