యూపీలో జర్నలిస్ట్ సహా నలుగురి అరెస్ట్... హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తుండగా...
కేరళకు చెందిన ఓ జర్నలిస్టుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తుండగా సోమవారం(అక్టోబర్ 5) రాత్రి మథుర టోల్ ప్లాజా వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు,ల్యాప్టాప్,కొన్ని పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేశారు.
అరెస్టయిన నలుగురి పేర్లను సిద్దిఖీ కప్పన్,అతిక్ రెహమాన్,మసూద్ అహ్మద్,ఆలమ్లుగా పోలీసులు తెలిపారు. వీరిలో కప్పన్ కేరళకు చెందిన ఓ వెబ్సైట్లో జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రస్తుతం ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో నివాసముంటున్నారు. కప్పన్ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(KUWJ)కు సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు. రెహమాన్ ముజఫర్నగర్ వాసి కాగా అహ్మద్ బహ్రయిచ్,ఆలమ్ రాంపూర్ వాసిగా తెలిపారు. హత్రాస్ బాధితురాలి తరుపున తాము కూడా గొంతెత్తేందుకే అక్కడికి వెళ్తున్నట్లు విచారణలో వారు వెల్లడించారని చెప్పారు.
మరోవైపు కేరళ జర్నలిస్ట్ యూనియన్ కప్పన్ అరెస్టును ఖండించింది. కప్పన్ కస్టడీకి సంబంధించి ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్ పోలీసులు తమకెలాంటి సమాచారం అందించలేదని జర్నలిస్ట్ యూనియన్ తెలిపింది. కప్పన్ను సంప్రదించేందుకు తాము చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని వెల్లడించింది.
కాగా,సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఓ దళిత యువతిపై నలుగురు అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు గ్యాంగ్రేప్కి పాల్పడిన సంగతి తెలిసిందే. తమ పేర్లు బయటపెట్టకుండా ఉండేందుకు బాధితురాలి నాలుకను కూడా నిందితులు కోసేశారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. అయితే రాత్రికే రాత్రే కుటుంబ సభ్యులను సైతం అనుమతించకుండా హడావుడిగా బాధితురాలి దహన సంస్కారాలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అలహాబాద్ కోర్టు దీన్ని సుమోటో కేసుగా తీసుకుంది.