జేడే హత్య కేసు: లేడి రిపోర్టర్ తో సహా 10 మీద చార్జీషీట్
ముంబై: సీనియర్ పాత్రికేయుడు జ్యోతిర్మయ్ డే (జేడే) హత్య కేసును దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర పోలీసులు పలువురి మీద కేసులు నమోదు చేసి చార్జీ షీట్లు రూపొందించారు. అరెస్టు అయిన వారిలో మహిళ జర్నలిస్ట్ జిగ్నా వోరా ఉన్న విషయం తెలిసిందే.
ముంబైలో సీనియర్ జర్నలిస్ట్ జేడే నివాసం ఉండేవారు. 2011 జూన్ 11వ తేదిన ఉదయం రెండు బైక్ లో వచ్చిన కొందరు నిందితులు జేడే మీద రివాల్వర్లతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పరారైనారు. వెంటనే జేడేని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే జేడే మరణించారు.
అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. జేడేని హత్య చేసిన వారిని అరెస్టు చెయ్యాలని ధర్నాలు చేశారు. కేసు నమోదు చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు 2011 నవంబర్ నెలలలో మహిళ జర్నలిస్ట్ జిగ్నా వోరాను అదుపులోకి తీసుకున్నారు.
ఆమెను విచారణ చెయ్యగా పలు రహస్యం బయటపడింది. మాఫియా ముఠా నాయకుడు చోట రాజన్ కు వ్యతిరేకంగా వార్తలు వ్రాయడం వలనే జేడేని హత్య చేశారని ,అందుకు మహిళ జర్నలిస్ట్ జిగ్నా వోరా సహకరించిందని పోలీసులు ఆదారాలు సేకరించారు.
జిగ్నా వోరాతో సహా 10 మంది మీద కేసులు నమోదు చేశారు. కుట్రపూరితంగా జేడేని పక్కా ప్లాన్ తో హత్య చేశారని, మాఫియా ముఠా నాయకులతో సంబంధాలు సాగిస్తున్నారని ఆరోపిస్తు పోలీసులు కేసు నమోదు చేసి చార్జీ షీట్ ప్రత్యేక న్యాయస్థానంలో సమర్పించారు.