అవినీతిపై కథనం, బెదిరింపు: జర్నలిస్ట్ అదృశ్యం
కోల్కతా: బెంగాలీ డెయిలీకి చెందిన ఓ విలేకరి అదృశ్యమైన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. అదృశ్యమైన విలేకరి అలిపుర్దౌర్ జిల్లాకు చెందినవాడు.
బెంగాళీ డెయిలి పత్రికకు చెందిన చాయన్ సర్కార్ అనే విలేకరి ఇటీవల ఓ కళాశాలలో ప్రవేశాల సందర్భంగా జరుగుతున్న అవినీతిని బయటపెట్టే కథనం రాశాడు. దీంతో ఆయనను పలువురు చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి.
అనంతరం ఆ విలేకరి తనను బెదిరించిన ఎనిమిది మంది పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు వారిని అరెస్టు చేశారు.
ఆ అరెస్టు జరిగిన తర్వాత నుంచి విలేకరి కనిపించకుండా పోయాడు. అతని కోసం గాలిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయన కనిపించకుండా పోయాడని చెప్పారు. అతనిని ఎవరో కిడ్నాప్ చేశారని, చాయన్ స్కూటర్, పర్సు, పుస్తకం ఒకచోట లభించాయని పోలీసులు తెలిపారు. ఆ కళాశాలలో అవినీతికి పాల్పడిన వారే ఈ ఘటనకు కూడా పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.