మీటూ ఉద్యమం: కేంద్ర మాజీమంత్రి ఎంజే అక్బర్ కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి ఎం జే అక్బర్ పదవిని ఊడగొట్టిన మీటూ ఉద్యమంలో ఆయనకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తనను అప్రతిష్టపాలు చేశారని అంటూ ఎం జే అక్బర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీనియర్ మహిళా జర్నలిస్టు ప్రియా రమణిని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ బుధవారం ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేశారు. తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేశారు.
గత ఏడాది అక్టోబర్ లో మీటూ ఉద్యమం దేశాన్ని ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ సహా పలు రంగాల్లో లైంగిక వేధింపులకు గురయ్యామంటూ పలువురు మహిళా ప్రముఖులు మీ టూ పేరుతో ఓ ఉద్యమాన్నే నడిపించిన విషయం తెలిసిందే. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు ప్రియా రమణి ప్రకటించారు. ప్రముఖ పాత్రికేయుడు, విదేశాంగ శాఖ మాజీ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తనను లైంగికంగా వేధించారంటూ ప్రియా రమణి సహా ఏకంగా 20 మంది మహిళా జర్నలిస్టులు బహిరంగంగా ప్రకటించారు. దీనతో ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అక్బర్ తనను లైంగికంగా వేధించారని అంటూ ప్రియా రమణి మూడేళ్ల కందట ది వోగ్ మేగజైన్ లో ఓ కథనాన్ని ప్రచురించారు. ఆ కథనంలో ఆమె ఎక్కడా ఎంజే అక్బర్ పేరును ప్రస్తావించలేదు. మీ టూ ఉద్యమం నేపథ్యంలో.. ఆమె అక్బర్ పేరును ప్రకటించారు. తాను అక్బర్ ను దృష్టిలో పెట్టుకునే ఆ కథనాన్ని రాశారనని వెల్లడించారు. దీనితో అక్బర్.. ఆమెపై పరువు నష్టం కేసు వేశారు. తనను ఉద్దేశపూరకంగా ఇబ్బందులకు గురి చేయడానికే ప్రియా రమణి తప్పుడు కథనాన్ని ప్రచురించారని అన్నారు.
పరువు నష్టం కేసులో ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం. ది వోగ్ మేగజైన్ లో ప్రచురించిన కథనంలో ఎక్కడా అక్బర్ పేరు ప్రస్తావించలేదని, అలాంటప్పుడు తనను ఉద్దేశించి ఎందుకు భావిస్తారని న్యాయస్థాన అక్బర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన సరైన సాక్ష్యాలను పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టులో ప్రవేశ పెట్టకపోవడంతో.. మెజిస్ట్రేట్ ప్రియా రమణిని నిర్దోషిగా తేల్చారు. బెయిల్ ను మంజూరు చేశారు. తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేశారు.