జర్నలిస్టు తల్లీకూతుళ్లను చంపేసి సంచీలో పెట్టి నల్లాలో పడేశాడు
నాగపూర్: నాగపూర్లో ఓ జర్నలిస్టు తల్లీకూతురు హత్యకు గురయ్యారు. స్థానిక జర్నలిస్టు తల్లిని, అతని కూతురిని దుండగులు హత్య చేసి నల్లాలో పడేశారు. హత్య జరిగిన 12 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు.
ఓ స్థానిక దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టు రవికాంత్ కాంబ్లే తల్లి ఉషా కాంబ్లే (52), కూతురు రాశి (1) గత సాయంత్రం కనిపించకుండా పోయారు. వారి శవాలు బహదురా ప్రాంతంలోని నలాలో ఆదివారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో కనిపించాయి.
వారి శరీరాలపై గాయాలున్నాయి. ఉషా కాంబ్లే మనీ లెండింగ్ వ్యాపారం చేస్తుందని డిప్యూటీ పోలీసు కమిషనర్ నీలేష్ భర్నే చెప్పారు. ఉషా తన మనవరాలు రాశితో కలిసి ఇంటి సమీపంలోని జువెల్లరీ దుకాణానికి శనివారం సాయంత్రం వెళ్లారు.
చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో ఆమె భర్త ఫోన్ చేశాడు. అయితే ఆమె ఫోన్ స్విచాఫ్ అయి ఉంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి పది గంటలకు ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసులో నాగపూర్లోని పవన్పుత్ర నగర్కు చెందిన గణేష్ రాంబరన్ సాహు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ శివాజ బోడ్ఖే చెప్పారు చిట్టి డబ్బులపై అతను, ఉషా కాంబ్లే గొడవ పడ్డారని ఆయన చెప్పారు.
గొడవలో ఉషా మెట్లపై నుంచి కిందికి జారి పడిందని, సాహు ఆమె గొంతు నులిమి చంపాడని చెప్పారు. ఆ తర్వాత జర్నలిస్టు కూతురిని చంపాడని చెప్పారు. శవాలను సంచీలో పెట్టి నల్లాలో పడేశాడని చెప్పారు.