జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్: జర్నలిస్టు షుజాత్ బుఖారీ హత్యకేసు నిందితుడు నవీద్ జత్ హతం
జమ్మూకశ్మీర్ సీనియర్ జర్నలిస్టు షూజాత్ బుఖారీ హత్యకేసులో నిందితుడిగా ఉన్న లష్కరే తొయిబా ఉగ్రవాది నవీద్ జత్ బుడ్గాం ఎన్కౌంటర్లో హతమయ్యాడు. బుధవారం భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర పోరులో ఇద్దరు ఉగ్రమూకలను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఇందులో నవీద్ జత్ కూడా ఉన్నాడు. పాకిస్తాన్కు చెందిన నవీద్ జత్ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనగర్లోని శ్రీ మహరాజా హరిసింగ్ ఆస్పత్రి నుంచి తప్పించుకున్నాడు. దక్షిణ కశ్మీర్లో నవీద్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడే ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉంటాయి.2013 -14లో నవీద్ అనేక ఉగ్రకార్యకలాపాలకు పాల్పడ్డాడు.
ముల్తాన్లో ఓ ట్రక్కు డ్రైవర్ కుమారుడు నవీద్. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో నవీద్ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా నిర్వహిస్తుంటాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు పుల్వామా, షోపియన్ జిల్లాల్లో కూడా నవీద్ కార్యకలాపాలు నడిపాడని పోలీసులు వెల్లడించారు. పోలీసుల రికార్డుల ప్రకారం నవీద్ 19 సెప్టెంబర్ 2014న అనంతనాగ్ జిల్లా సెంపోరా బిజ్బెహరాలో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత శ్రీనగర్లోని రైనావారి జైల్లో ఉంచారు. నవీద్పై హత్య, అంటెప్ట్ టు మర్డర్ కేసులను నమోదు చేశారు పోలీసులు.
కుత్పోరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతాదళాలు ఆ గ్రామాన్ని జల్లెడ పట్టాయి. ఓ చోట దాక్కున ఉగ్రవాదులను భద్రతాదళాలు సమీపిస్తుండగా వారిపైకి కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. దీంతో భద్రతా బలగాలు తిరిగి ఎదురు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలోనే నవీద్ జత్తో సహా మరో ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బద్గామ్, పుల్వామా జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ను పోలీసులు తాత్కాలికంగా నిషేధించారు.