మహిళా జర్నలిస్టును వెంటాడి వేధించారు: వారి ఫొటోలు తీసి, ఎఫ్బీలో పోస్టు
ఆగ్రా: ఓ టీవీ జర్నలిస్టు(యాంకర్)ను ఇద్దరు యువకులు వేధించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. టీవీ ఛానెల్లో తన విధులు పూర్తి చేసుకుని అర్ధరాత్రి సమయంలో తన స్కూటీపై ఇంటికి వెళుతోన్న యాంకర్ దామినిని ఇద్దరు వ్యక్తులు బైక్పై వెంబడించారు.
ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా ఆమె తెలిపింది. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఎంజీ రోడ్ భగవాన్ టాకీస్ నుంచి తనను ఇద్దరు వెంబడించారని, వారు తన వెనకాలే వచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
చాలా భయానికి గురైన తాను వేరే దారి గుండా వెళదామని నిర్ణయించుకుని, దారి మళ్లానని చెప్పింది. అయినప్పటికీ ఆ యువకులు తన వెనకాలే వచ్చారని ఆమె తెలిపింది. చివరకు వారి నుంచి తాను తప్పించుకున్నట్లు పేర్కొంది.
అయితే, వారి ఫొటోలను తీసిన ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. వారి బైక్ నెంబరును కూడా ఆమె పోస్ట్ చేసింది. అయితే, తాను పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా, ఆమె తన ఫేస్బుక్ పొస్ట్ను యూపీ సీఎం, డీజీపీ, మహిళల హెల్ప్లైన్కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిన 1090 సిబ్బందిపై చర్యలు తీసుకుంది. కేసు నమోదు చేసి మూడురోజుల్లో నిందితులిద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.