బెంగాల్లో పరివర్తన్ రథయాత్రను ప్రారంభించిన జేపీ నడ్డా... టార్గెట్ మమతా...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం(ఫిబ్రవరి 6) పశ్చిమ బెంగాల్లో 'పరివర్తన్ రథ యాత్ర'ను ప్రారంభించారు. నదియా జిల్లాలోని నబాద్విప్ పట్టణంలో పార్టీ జెండాను ఊపి 'పరివర్తన్ యాత్ర'కు శ్రీకారం చుట్టారు. యాత్రలో భాగంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన రోడ్ షోలలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు.
తల్లి, నేల, ప్రజలపై ప్రమాణం చేసి మరీ మమతా బెనర్జీ పదేళ్ల కింద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని జేపీ నడ్డా గుర్తు చేశారు. అయితే ఈ పదేళ్ల కాలంలో ఆమె తల్లిని కొల్లగొట్టారని, నేలను అగౌరవపరిచారని, ప్రజలకు రక్షణ లేకుండా చేశారని విమర్శించారు. బీజేపీ 'పరివర్తన్ యాత్ర' ప్రభుత్వ మార్పు కోసం మాత్రమే కాదని, బెంగాల్ ప్రజల ఆలోచనలో మార్పు కోసం కూడా అని చెప్పారు. యాత్ర ద్వారా బెంగాల్ ప్రజలను మేల్కొల్పుతామని చెప్పారు. బెంగాల్లో అభివృద్ది పేరుతో టీఎంసీ నేతలే దోచుకుతిన్నారని ఆరోపించారు.
'ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్కు అన్నీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ మమత 'చాహి నా, చాహి నా, చాహి నా'(అవసరం లేదు) అంటూ ప్రతిదానికి అడ్డుపడ్డారు.మమత వద్దన్నవన్నీ రాబోయే మే నెల తర్వాత జరుగుతాయి. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అందుకే బీజేపీ కార్యక్రమాల్లో భారీగా పాల్గొంటున్నారు.' అని జేపీ నడ్డా పేర్కొన్నారు.
మమతా బెనర్జీ అహం కారణంగా బెంగాల్ రైతులు కేంద్ర పథకాల ప్రయోజనాలను పొందలేకపోయారని అన్నారు. గత రెండేళ్లుగా బెంగాల్ లోని 70 లక్షల మంది రైతులకు ఏటా కేంద్రం నుంచి అందాల్సిన రూ.6 వేలు సాయం అందలేదని... మమతా అహంకారపూరిత ధోరణే ఇందుకు కారణమని విమర్శించారు.
పరివర్తన్ యాత్రకు మమతా బెనర్జీ నో చెప్పినా.. ప్రజలు తమకు అనుమతినిచ్చారని నడ్డా అన్నారు. కాగా,బెంగాల్లో బీజేపీ రథయాత్ర చేపడితే మత విద్వేషాలు,అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. త్వరలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఎంసీకి,బీజేపీకి మధ్య అక్కడ పెద్ద యుద్దమే నడుస్తోంది.