బీజేపీ భారీ ర్యాలీ.. కోల్ కతా వీధులన్నీ కాషాయమయం.. సీఏఏపై చెవాకులు మానుకోవాలని సీఎం మమతకు వార్నింగ్.
వెస్ట్ బెంగాల్ లో దూకుడుమీదున్న బీజేపీ సోమవారం 'సీఏఏ జన జాగరణ్' పేరుతో సోమవారం కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించింది. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కర్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరై.. ర్యాలీని నడిపించారు. నడ్డాతోపాటు వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కైలాస్ విజయ్ వర్గియాతోపాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
మమతపై ఫైర్..
కేంద్రం రూపొందించిన సీఏఏను వెస్ట్ బెంగాల్ లో అమలు చేయబోమన్న సీఎం మమతా బెనర్జీ కామెంట్లను బీజేపీ నేతలు ఖండించారు. మంచి ఉద్దేశంతో మోడీ సర్కార్ తీసుకున్న చట్టాన్ని మమత అపహాస్యం చేస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తూ, ముస్లింలలో లేనిపోని రీతిలో భయపెడుతున్నారని నడ్డా మండిపడ్డారు. కోల్ కతా వీధుల్లో బీజేపీ ర్యాలీకి వచ్చిన ఆదరణ చూసిన తర్వాతైనా మమత మనసుమార్చుకోవాలని చురక వేశారు. పాలన గాలికొదిలేసి, మత రాజకీయాలు చేస్తున్న మమతకు ప్రజలే బుద్ధిచెబుతారని బీజేపీ సీనియర్లు అన్నారు.
దీదీకి ధీటుగా బీజేపీ
సీఏఏ వ్యతిరేక నిరసనలో భాగంగా సీఎం మమతా బెనర్జీ గడిచిన వారమంతా కోల్ కతా సిటీలో పెద్ద ఎత్తున పాదయాత్రలు చేశారు. ఆమెకు ధీటుగా సోమవారంనాటి బీజేపీ ర్యాలీలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు కదంతొక్కారు. సెంట్రల్ కోల్ కతాలోని హింద్ సినిమా ఏరియా నుంచి ప్రారంభమైన బీజేపీ ర్యాలీ శ్యామ్ బజార్ దాకా కొనసాగింది. దారిపొడవునా కార్యకర్తలు.. సీఏఏ, కేంద్రం, ప్రధాని మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
పాట్నా, బెంగళూరులోనూ..
బీజేపీ ఆధ్వర్యంలో సీఏఏ అనుకూల ర్యాలీలు పాట్నా, బెంగళూరు తదితర నగరాల్లోనూ జరిగాయి. పాట్నాలో ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ చేపట్టిన ర్యాలీలో బీజేపీ కర్యాకర్తలూ భాగం పంచుకున్నారు. బెంగళూరులో ఆదివారం చాలా చోట్ల సీఏఏ అనుకూల ర్యాలీలు జరిగియాయి. దేశంలోని ఇతర నగరాల్లోనూ సీఏఏ అనుకూల కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది.