పరీక్ష పాస్: తొలి సవాల్: అమిత్ షా వారసుడిగా జేపీ నడ్డాకు పట్టాభిషేకం: ముహూర్తం ఖరారు..!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా ఇక పూర్తిస్థాయిలో పగ్గాలను అందుకోనున్నారు. అమిత్ షా వారసుడిగా అయిదారు నెలల కిందటే పార్టీ బాధ్యతలను అందుకున్న ఆయన ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నడ్డా పనితీరు ఫర్వాలేదనిపించుకోవడంతో ఇక పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలను ఆయన చేతికి అప్పగించాలని అగ్ర నాయకులు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీన ఆయన బాధ్యతలను స్వీకరించవచ్చని తెలుస్తోంది.
సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..
రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ, ఆయా రాష్ట్ర శాఖల అధ్యక్షులు, ఇతర పదాధికారుల నియామకం వంటి అంశాల వల్ల జేపీ నడ్డాకు పూర్తిస్థాయిలో బాధ్యతలను అప్పగించడంలో జాప్యం చోటు చేసుకుందని చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసి పోవడంతో.. ఇక జాతీయ స్థాయిలో పార్టీ క్యాడర్లో మార్పులు చేర్పులు చేయాలని కోర్ కమిటీ భావించింది.
అమిత్ షా తప్పుకొన్నా.. ఆయన చేతుల్లోనే..
ఇందులో భాగంగా- మొదటగా జేపీ నడ్డాకు పూర్తిస్థాయిలో పార్టీ సారథ్య బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్ షా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ పూర్తిస్థాయిలో పరిపాలనా పరమైన వ్యవహారాలపైనే దృష్టి సారించాల్సి వచ్చింది. దీనితో జేపీ నడ్డాను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. అయినప్పటికీ.. కొన్ని కీలకమైన పార్టీ వ్యవహారాలను అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు.
చేదు ఫలితాలతో..
మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, హంగ్ ఏర్పడిన మహారాష్ట్ర, హర్యానాల్లో పార్టీ పనితీరు వంటి అంశాలన్నీ అమిత్ షా పర్యవేక్షణలోనే కొనసాగాయి. హర్యానా మినహా మిగిలిన రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి చుక్కెదురైంది. ఈ పరిస్థితుల్లో ఇక పూర్తిస్థాయి పార్టీ వ్యవహారాలు ఎవరో ఒకరి చేతుల్లోనే ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనితో జేపీ నడ్డాను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తొలి సవాల్..
ఈ సందర్భంగా- దేశ రాజధానిలో ఓ భారీ సభను ఏర్పాటు చేయడానికి పార్టీ అగ్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిసి రావడం వల్ల ఈ సభను ఎన్నికల ప్రచారానికి కూడా వినియోగించుకోనుంది బీజేపీ. జేపీ నడ్డా బాధ్యతలను స్వీకరించిన వెంటనే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, రోడ్షోలల్లో పాల్గొనే అవకాశాలు లేకపోలేదని సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఇక ఆయనే పర్యవేక్షిస్తారని చెబుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రూపంలో జేపీ నడ్డాకు తొలి సవాల్ ఎదురైందని, ఆయన దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారని పార్టీ నాయకులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.