అమిత్ షా వారసుడిగా జేపీ నడ్డా!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందన్న అంశంపై నెలకొన్న సస్పెన్స్కు తొందరగానే తెర పడింది. దేశవ్యాప్తంగా పార్టీని విజయపథంలో నడిపించిన అమిత్ షా వారసుడెవరో తేలిపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా జేపీ నడ్డా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
అమిత్ షా కేంద్ర కేబినెట్లో చేరడం ఖాయమైంది. గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండటం లాంఛనప్రాయమే. ఒకే వ్యక్తికి జోడు పదవులు ఉండకూడదనేది బీజేపీ ప్రాథమిక సిద్ధాంతం. దీన్ని అనుసరించి అమిత్ షా తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆయన వారసుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై రెండురోజులుగా పార్టీలో చర్చ నడుస్తోంది. మొదట్లో ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ పేరు వినిపించింది. ఆయనతో పాటు జేపీ నడ్డా పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నారు.
ఇదివరకు ఆయన ఎన్డీఏ-1లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 51 సంవత్సరాల జేపీ నడ్డా సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేబినెట్లో చేరారు. బిహార్ రాజధాని పాట్నాలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. పాట్నా యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. హిమాచల్ అసెంబ్లీ నుంచి మూడుసార్లు గెలుపొందారు.
కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్లల్లో బీజేపీ ప్రస్తుతం ప్రతిపక్షంలో కొనసాగుతోంది. అధికారాన్ని అందుకోవడానికి ఆ పార్టీకి పెద్దగా సీట్లు అవసరం లేదు. ఈ నేపథ్యంలో- ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వాలను అస్థిర పరిచే ప్రయత్నాలు సాగుతున్నాయి.
వాటిని జేపీ నడ్డా విజయవంతంగా పూర్తి చేయడం, దీనితోపాటు అనూహ్యంగా తెలంగాణలో నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకోవడంతో క్రమంగా అక్కడ పాగా వేయడానికి చర్యలు చేపట్టడానికి వ్యూహాలను రచించడంలో అమిత్ షాకు జేపీ నడ్డా సహకరించినట్లు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి తీసుకోవాల్సిన అన్ని అంశాలపై అమిత్ షాకు విలువైన సూచనలు, సలహాలను ఇచ్చారని చెబుతున్నారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జేపీ నడ్డాకు పార్టీ అధ్యక్ష పగ్గాలను అప్పగించినట్లు తెలుస్తోంది.