కొత్త బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా..? ఏకగ్రీంగా ఎన్నికయ్యే అవకాశం
న్యూఢిల్లీ: ప్రస్తుత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కమలం పార్టీ జాతీయాధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా పదవీకాలం ముగియడంతో కొత్త పార్టీ చీఫ్గా జేపీ నడ్డా పగ్గాలు చేపట్టనున్నారు. సోమవారం రోజున నడ్డా ఎన్నిక ఏకగ్రీవం కానున్నట్లు సమాచారం. జేపీ నడ్డా పార్టీ చీఫ్గా నియమించబడితే మరో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి కోసం జరిగే ఎన్నికకు పార్టీ అగ్రనాయకులు, అంటే కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు, ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంకు చేరుకుంటున్నారు. బీజేపీ చీఫ్గా నడ్డానే నియమించాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షాలు కోరుకుంటున్నారు.
విద్యార్థి రాజకీయాల నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ వరకు...
జేపీ నడ్డా పార్టీతో గత పదేళ్లుగా పయనిస్తున్నారు. అంతేకాదు ఆర్ఎస్ఎస్లో సైతం తన సేవలను అందించారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఆర్ఎస్ఎస్లో ఉండటం, క్లీన్ ఇమేజ్ ఉండటం వల్ల బీజేపీ టాప్ పోస్టును చేపట్టేందుకు బలంగా మారాయి. గతేడాది జూలైలో జేపీ నడ్డా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులు కాగా... ఇక జాతీయాధ్యక్షుడిగా తనే ఉంటారని అప్పుడే అంతా భావించారు. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా జేపీ నడ్డా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి ఇంఛార్జ్గా వ్యవహించారు. ఈ క్రమంలోనే బీజేపీ 80 స్థానాలకుగాను 62 స్థానాల్లో విజయం సాధించింది. 2014లో తొలిసారిగా మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు జేపీ నడ్డా కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
ఎన్నిక ప్రక్రయి ఇలా ఉంటుంది
జనవరి 20వ తేదీన బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ జరుగుతుందని ఒకవేళ మరెవరైనా నామినేషన్ దాఖలు చేస్తే మరుసటి రోజున అంటే జనవరి 21న ఎన్నిక నిర్వహిస్తామని జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను మానిటర్ చేస్తున్న సీనియర్ బీజేపీ నేత రాధామోహన్ సింగ్ చెప్పారు. ఎలాంటి పోటీ లేకుండానే ఏకాభిప్రాయంతో అధ్యక్షుడి ఎన్నిక జరగడం ఆనవాయితీగా వస్తోందని ఈ సారి కూడా అదే జరుగుతుందని పలువురు పార్టీ నేతలు చెప్పారు.
అమిత్ షా చీఫ్గా ఉన్న సమయంలో ఎన్నో విజయాలు
2014లో అప్పటి బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తర్వాత ఆ పదవిని చేపట్టిన అమిత్ షా పదవీకాలం ముగియనుంది. 2016 జనవరిలో అమిత్ షా రెండోసారి జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. అంతేకాదు అమిత్ షా బీజేపీ చీఫ్గా ఉన్న సమయంలోనే ఆ పార్టీ పలు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. మరోవైపు ఒక వ్యక్తి ఒక పోస్టు నినాదంతో బీజేపీ ముందుకెళుతున్నందున రెండు పదవులు నిర్వహిస్తున్న అమిత్ షా జాతీయాధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోనున్నారు.
ఢిల్లీ ఎన్నికలతో సహా నడ్డా ముందు పలు సవాళ్లు
ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంకు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలో జేపీ నడ్డా బీజేపీ జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండటం విశేషం. అంతేకాదు జేఎన్యూలో హింసాత్మక ఘటన కూడా నడ్డాకు సవాల్గా మారనుంది. ఇక మహారాష్ట్రలో బీజేపీని కాదని కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన, హర్యానాలో బొటాబొటి మెజార్టీ, జార్ఖండ్లో బీజేపీ ఓటమి ఇలా పలు అంశాలతో బీజేపీ వెనకంజలో ఉంది. ఇక వచ్చేనెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా జేపీ నడ్డాకు ఇది పెను సవాలుగా మారే అవకాశం ఉంది. మరి జేపీ నడ్డా పార్టీని తిరిగి ఏమేరకు పుంజుకునేలా వ్యూహాలు రచిస్తారో వేచిచూడాలి.