రిచా భారతీ పోరాటానికి దిగొచ్చిన రాంచీ కోర్టు.. ఖురాన్ను పంచాల్సిన అవసరం లేదు..
రాంచీ : మత విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటూ కేసు ఎదుర్కొంటున్న రిచా భారతీకి రిలీఫ్ దొరికింది. ఐదు ఖురాన్లు పంచాలంటూ కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన రాంచీ కోర్టు షరతుల్లో మార్పు చేసింది. అంజుమన్ సంస్థతో పాటు స్కూల్, కాలేజీ లైబ్రరీలకు ఖురాన్లు పంచాల్సిన అవసరంలేదని న్యాయమూర్తి స్పష్టంచేశారు.
ఖురాన్లు పంచాలన్న కోర్టు షరుతుపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు ఈ విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఖురాన్లను పంచాలన్న షరతును అమలు చేయడం కష్టంతో కూడుకున్నదన్న పోలీసుల అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం షరతును మార్పు చేసింది. ఈ మేరకు సవరించిన ఉత్తర్వులు జారీ చేశారు.
న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిచా భారతి బెయిల్ కోసం ఇద్దరు ష్యూరిటీలు రూ.7వేల చొప్పున పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఖురాన్లు పంచాలన్న నిర్ణయాన్ని రిచా తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు రాంచీ కోర్టు నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు ఆమె న్యాయపోరాటానికి అవసరమైన మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకొచ్చారు. బీజేపీ నేతలతో పాటు పలువురు లాయర్లు సైతం కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పోలీసుల అభ్యర్థన మేరకు కోర్టు చరిత్రలో తొలిసారి న్యాయమార్తి బెయిల్ కండీషన్లను మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.