అంత ఉత్కంఠ వేళ: జడ్జి పేల్చిన జోకుతో సుప్రీంకోర్టులో ఒక్కసారిగా నవ్వులు..
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఎంత హీటెక్కిస్తున్నాయో.. సోషల్ మీడియాలో అంతేస్థాయిలో జోకులు పేలుతున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిక్రీ సైతం ఓ వాట్సాప్ జోకును కోర్టులో చదివి వినిపించడం విశేషం. ఆ జోకుకు కోర్టు ప్రాంగణమంతా ఒక్కసారిగా నవ్వులతో ముంచెత్తిపోయింది.
కాంగ్రెస్, జేడీఎస్ లు దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తున్న క్రమంలో..'మాకు ఇప్పుడే ఓ వాట్సాప్ సందేశం వచ్చింది' అని జస్టిస్ సిక్రీ అన్నారు. దీంతో అంతా ఆ సందేశం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తుండగా.. అదేంటో ఆయనే చెప్పారు.
'మా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నన్ను సీఎం చేయండి అంటూ హోటల్ యజమాని సందేశం పంపించాడు' అని సిక్రీ ఆ వాట్సాప్ సందేశాన్ని చదివి వినిపించడంతో అంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. తీర్పు కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నవేళ జస్టిస్ సిక్రీ ఈ జోకు పేల్చడం గమనార్హం.
కాగా, యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై బుధవారం అర్థరాత్రి కాంగ్రెస్, జేడీఎస్ లు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారంపై స్టే ఇవ్వడం కుదరదన్న సుప్రీం.. బలనిరూపణ గడవును మాత్రం 15రోజుల నుంచి శనివారం సాయంత్రం 4గం.కి కుదించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తపడుతున్నాయి. శుక్రవారం రాత్రి 10గం. తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ హోటళ్ల నుంచి తరలించారు.