నీటి బిల్లు ఎఫెక్ట్: జడ్జిలు, ఐఏఎస్ అధికారుల బంగ్లాలకు నీటి సరఫరా కట్, షాక్ అంటే ఇదే!
బెంగళూరు: పేదలు, మధ్యతరగతి వారు నీళ్ల బిల్లులు చెల్లించకుంటే వారి ఇంటికి నీటి సరఫరాను నిలిపివేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే బెంగళూరు నగరంలో జలమండలి సిబ్బంది ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా హైకోర్టు జడ్జిలు, ఐఏఎస్ అధికారుల బంగ్లాలకు నీటి సరఫరా నిలిపివేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. చాల కాలంగా నీటి సరఫరా బిల్లులు చెల్లించకపోవడంతో బెంగళూరు జలమండలి సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
రూ. 1.95 కోట్ల బిల్లులు
బెంగళూరు నగరంలోని కోరమంగలలోని నేషనల్ గేమ్స్ విలేజ్ లో ఐఏఎస్ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, వందలాది మంది ఏ, బి కేటగిరి ఉద్యోగులు బంగ్లాల్లో, క్వాటర్స్ లో నివాసం ఉంటున్నారు. ఈ బంగ్లాలు, క్వాటర్స్ లో నివాసం ఉంటున్న వారు రూ. 1. 95 కోట్లు నీటి సరఫరా బిల్లులు చెల్లించలేదని జలమండలి అధికారులు ఆరోపిస్తున్నారు.
ఒక్క బంగ్లాకు రూ. 450 బిల్లు
ప్రతి బంగ్లా, క్వాటర్స్ కు ప్రతి నెల రూ. 450 నీటి బిల్లు చెల్లించాలని జలమండలి అధికారులు నిర్ణయించారు. నేషల్ గేమ్స్ విలేజ్ లో నివాసం ఉంటున్న అధికారుల జీతం నుంచి ప్రతి నెల రూ. 450 వసూలు చేసి జలమండలికి చెల్లించే భాద్యతను ప్రజాపనుల శాఖ అధికారులు చూసుకుంటున్నారు.
10 బ్లాక్ ల్లో క్వాటర్స్
నేషల్ గేమ్స్ విలేజ్ లో న్యాయమూరుల లేఔట్, కృష్ణ, శరావతి, మలప్రభ, ఘటప్రభ తో సహ 10 బ్లాక్ లు ఉన్నాయి. నేషనల్ గేమ్స్ విలేజ్ లో వందలాది బంగ్లాలు, క్వాటర్స్, అధికారుల వసతి గృహాలు ఉన్నాయి. నేషనల్ గేమ్స్ విలేజ్ లో కర్ణాటక హౌసింగ్ బోర్డు (కేహెచ్ బి) బంగ్లాలు, క్వాటర్స్ నిర్మించింది.
ప్రజా పనుల శాఖ
నేషనల్ గేమ్స్ విలేజ్ లోని అన్ని బంగ్లాలు, క్వాటర్స్ కు నీరు సరఫరా చెయ్యడానికి కేహెచ్ బి పేరుతోనే అధికారులు రికార్డులు తీసుకున్నారు. నేషనల్ గేమ్స్ విలేజ్ లోని లోని బంగ్లాలు, క్వాటర్స్ నిర్వహణ భాద్యతలను ప్రజా పనుల శాఖ అధికారులు చూసుకుంటున్నారు.
అధికారులు సీరియస్
నేషనల్ గేమ్స్ విలేజ్ లోని కొన్ని భవనాలను కేహెచ్ బి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించింది. ప్రైవేటు వ్యక్తులతో పాటు అధికారులు సక్రమంగా నీటి బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కృష్ణ బ్లాక్ లో 280, శరావతి బ్లాక్ లో సుమారు 220 క్వాటర్స్ ఉన్నాయి. జలమండలి అధికారుల నిర్ణయంతో నేషనల్ గేమ్స్ విలేజ్ లో నివాసం ఉంటున్న జడ్జిలు, ఐఏఎస్ అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురైనారు.