రామమందిరం నిర్మాణంపై తీర్పు ఇవ్వలేకపోతే జడ్జీలు రాజీనామా చేయాలి: ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రీశ్ కుమార్
ఆర్ఎస్ఎస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇది వారికి కొత్తేమీ కాకపోయినప్పటికీ ఈ సారి మాత్రం ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం లక్ష్యంగా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఇంద్రేశ్ కుమార్ అయోధ్య కేసును విచారణ చేస్తున్న బెంచ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇప్పటికే జాప్యం అయ్యిందని ఆలయం నిర్మాణం జరిగేందుకు ఇద్దరు లేద ముగ్గురు జడ్జీలు ఇచ్చే తీర్పుకోసం వేచిచూసే పరిస్థితి లేదని అన్నారు.
ఆర్డినెన్స్ తీసుకొచ్చే యోచనలో కేంద్రం
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మోడీ సర్కార్ ఆలయ నిర్మాణంపై మౌనంగా ఉందని... ఈ ఎన్నికలు పూర్తి కాగనే బాబ్రీ మసీదు స్థలంలోనే రామ మందిర నిర్మాణం జరిగేలా చట్టం తీసుకొచ్చే యోచనలో ఉందని ఇంద్రేష్ కుమార్ తెలిపారు. అయోద్యలో రామ మందిరం నిర్మాణం జరిగితే దేశం ఏమి తగలబడిపోదనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ విషయంలో దేశం ఏమైనా తగలబడిపోయిందా అంటూ ప్రశ్నించారు.
తీర్పు చెప్పడం చేతకాకపోతే జడ్జీలు రాజీనామా చేయాలి: ఇంద్రీష్
ఇక అయోద్య కేసు విషయానికొస్తే సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కావాలనే తీర్పు చెప్పడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. జనవరిలో ఈ కేసును విచారణ చేస్తామని బెంచ్ చెప్పడంపై ఇంద్రేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జడ్జీల పేరును ప్రస్తావించడంలేదని ఎందుకంటే 125 కోట్ల భారతీయులకు వీరి పేర్లు తెలుసని చెప్పిన ఇంద్రేశ్... రామమందిర నిర్మాణం కేసులో వీరు జాప్యం చేయడమే కాదు, వీరికి ఇష్టం కూడా లేదని ఆరోపించారు. అంతేకాదు వెంటనే తీర్పు చెప్పని పక్షంలో వీరు జడ్జీల స్థానాల్లో ఉండాలా లేదా రాజీనామా చేయాలా అనేది ఆలోచించుకోవాలని హెచ్చరించారు ఇంద్రేశ్.
2019 ఎన్నికల లోపు రామమందిర నిర్మాణ పనులు ప్రారంభం
ఇదిలా ఉంటే అయోధ్య కేసును వెంటనే విచారణ చేయలేమని ఈ కేసు రాజకీయంగా చాలా సున్నితమైన కేసు అని చెబుతూ సర్వోన్నత న్యాయస్థానం విచారణను జనవరికి వాయిదా వేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పలు సంఘ పరివార్లు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో దిగివచ్చిన కేంద్రం అయోద్య నిర్మాణంకు ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ఈ శీతాకాల సమావేశాల్లో ప్రయత్నిస్తామని కేంద్రం తెలిపింది. అంతేకాదు కోర్టు తీర్పు కోసం ఎదురుచూడకుండా... ఆర్డినెన్స్ తీసుకొచ్చి 2019 లోక్ సభ ఎన్నికలకంటే ముందు ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తే అన్ని పార్టీలు బలవంతంగా అయినా సరే రామమందిర నిర్మాణంకు ఒప్పుకుని తీరాల్సిందే అన్నారు ఇంద్రీశ్ కుమార్.