'ఖరీదైన ఫ్లాట్ అమ్మిన ఎయిర్ హోస్టెస్, రూ.1.2 కోట్ల కోసం భర్తతో గొడవ'
ఢిల్లీ: ఎయిర్ హోస్టెస్ అనిస్సియా భాత్రా (39) ఆత్మహత్య కేసులో ఆమె భర్త మయాంగ్ సింఘ్వీని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మంగళవారం ఆయనకు కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఆత్మహత్యకు ముందు ఎయిర్ హోస్టెస్ తన భర్తకు మెసేజ్ కూడా చేసింది. నా చావు చూస్తారని ఆమె పేర్కొంది.
భవనంపైనుంచి పడి ఎయిర్హోస్టెస్ అనుమానాస్పద మృతి, భర్తే చంపేశాడా?
14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్
మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అనుజ్ కుమార్ భర్తకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. నిందితుడి కస్టడీ అవసరం లేదని పోలీసులు చెప్పారు. జర్మనీ ఎయిర్ లైన్స్లో పని చేస్తున్న అనిస్సియా భాత్రా శుక్రవారం ఇంటిలోని టెర్రాస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త గుర్గావ్లో సాఫ్టువేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు.
ఫ్లాట్ అమ్మిన రూ.1.2 కోట్ల కోసం గొడవ
ఆమెను భర్త శారీరకంగా వేధింపులకు గురి చేసేవాడని ఆమె అనిస్సియా తల్లిదండ్రులు ఆరోపించారు. ఢిల్లీలోని వసంత్ విహార్లోని తన ఫ్లాట్ను అనిస్సియా ఫిబ్రవరిలో రూ.1.2 కోట్లకు అమ్మిందని, ఆ మొత్తాన్ని ఆమె తన బ్యాంక్ అకౌంటులో జమ చేసుకుందని, కానీ భర్త మాత్రం ఆ డబ్బు కోసం ఒత్తిడి చేశారని, ఇరువురి మధ్య దీనిపై గొడవ జరిగేదని తల్లిదండ్రులు ఆరోపించినట్లుగా విచారణ అధికారులు చెప్పారు. ఇరువురి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని పోలీసులు బ్యాంకు అధికారులకు సూచించారు. అలాగే, వారి ఫోన్లను సీజ్ చేశారు.
రెండేళ్ల క్రితం పెళ్లి
అనిస్సియాకు రెండేళ్ల క్రితం మయాంక్తో పెళ్లయింది. అప్పటి నుంచి ఆమె భర్తతో పాటు అత్తింటి వారు వేధిస్తున్నారని ఆమె తండ్రి ఆర్ఎస్ భత్రా పోలీసులకు అంతకుముందు ఫిర్యాదు చేశారు. మద్యం తాగి వచ్చి డబ్బు కావాలని హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని రాతపూర్వకంగా ముందే ఫిర్యాదు చేశారు. ఇలా జరిగిన కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
దయచేసి అతడిని వదలవద్దని
మయాంక్ కారణంగా తాను జీవితాన్ని కోల్పోతున్నానని, దయచేసి అతడిని వదలవద్దని సందేశం పంపినట్లు అనిస్సియా సోదరుడు కూడా తెలిపారు. మయాంక్ ఆమెను తోసేశాడా లేక ఆమె దూకిందా తెలియదన్నారు. గత నెలలో తమ పేరెంట్స్ చండీగఢ్ నుంచి వచ్చారని, అప్పుడు మయాంక్ వారిని కూడా కొట్టాడని ఆరోపించారు. జూన్ 27న తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తర్వాత తన తల్లి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తిరిగి చండీగఢ్ వెళ్లిపోయారని సోదరుడు తెలిపారు.