శశికళకు షాక్: ఒక్కటవుతున్న పళని, పన్నీరు, జయ మృతిపై విచారణకు ఆదేశం
తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎలాగైనా అన్నాడీఎంకేలో శశికళ వర్గానికి చెక్ పెట్టాలన్న వ్యూహంతో సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వంలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది.
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎలాగైనా అన్నాడీఎంకేలో శశికళ వర్గానికి చెక్ పెట్టాలన్న వ్యూహంతో సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వంలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దివంగత సీఎం జయలలిత మృతిపై జుడీషియల్ విచారణకు సీఎం పళనిస్వామి ఆదేశించారు. రిటైర్డ్ జడ్జీతో విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
శశికళ వర్గాన్ని బయటికి పంపేయత్నం
అంతేగాక, పోయేష్ గార్డెన్లోని వేద నిలయాన్ని జయ స్మారక మందిరంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. దీంతో వేదనిలయం నుంచి శశికళ వర్గాన్ని బయటికి పంపే కార్యక్రమాలు మొదలయ్యాయి. కాగా, ఇవి రెండూ కూడా పన్నీరుసెల్వం.. పళని ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లే కావడం గమనార్హం.
శశికళ, దినకరన్లకు చెక్
ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాతే పళని వేగంగా చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. జయ మృతిపై విచారణ పేరుతో శశికళ ఇమేజ్ను సీఎం, మాజీ సీఎంలు కలిసి తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. శశికళ, దినకరణ్లకు చెక్ పెట్టేందుకే వీరిద్దరు చేతులు కలిపినట్లు తెలుస్తోంది.
పన్నీరుకు డిప్యూటీ సీఎం, మైత్రేయన్కు కేంద్రమంత్రి..
ఈ నేపథ్యంలో పళని మంత్రి వర్గంలో పన్నీరు వర్గం చేరే అవకాశం ఉంది. పన్నీరుసెల్వంకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. అన్నాడీఎంకేలోని పళని, పన్నీరు వర్గాలు కలిసిన తర్వాత ఎన్డీఏలో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో అన్నాడీకేఎంకే ఎంపీ మైత్రేయన్కు కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రజినీకాంత్ ఏం చేస్తారో..
పళని, పన్నీరు ఏకమవుతుండటంతో తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలా కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే.