సామాన్యుడికి అందని ద్రాక్షలా మారింది: న్యాయ ప్రక్రియపై రాష్ట్రపతి కోవింద్ ఆందోళన
జోధ్పూర్: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ న్యాయ ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో న్యాయ ప్రక్రియ ఖరీదైనదిగా మారిందని.. సామాన్యుడికి అందని ద్రాక్షలా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్లో హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ప్రసంగించారు.
న్యాయ ప్రక్రియ సామాన్యుడికి అందకుండా.. ఎంతో ఖర్చుతో కూడుకున్నదిగా మారిపోయిందని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఉన్నత న్యాయస్థానాలు సాధారణ న్యాయవాదులకు అసాధ్యమైన రీతిలో ఉన్నాయన్నారు. నేడు ఎవరైనా పేద వ్యక్తి ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వస్తున్నాడా? అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న అని ఆయన అన్నారు.
రాజ్యాంగం ముందుమాటలో ప్రతి వ్యక్తికి న్యాయం అందించాలి అనే బాధ్యతను మనం అంగీకరించాం కాబట్టి ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో న్యాయప్రక్రియలో ఖర్చుల గురించి మహాత్మా గాంధీ కూడా ఆందోళన వ్యక్తం చేశారని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గుర్తు చేశారు.
గాంధీకి నిరుపేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, అలా గాంధీ ఆలోచనా విధానాన్ని మనం మనసులో పెట్టుకుని నిరుపేదల గురించి ఆలోచిస్తే మనం సరైన మార్గంలో వెళ్లగలమని రాష్ట్రపతి అన్నారు. ప్రముఖ న్యాయవాది అశోక్ సేన్ను గుర్తు చేస్తూ.. ఆయన అందరికీ న్యాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.
న్యాయవాద వృత్తిలో ఉన్నవారంతా అశోక్ సేన్ను ఆదర్శంగా తీసుకుని అవసరమైన వారికి న్యాయ ఫలాలు అందించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తొమ్మిది ప్రాంతీయ భాషల్లో తీర్పు చెప్పడం ప్రారంభించడంపై ఈ సందర్భంగా రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.