BSNL కష్టాలు: ఉద్యోగస్తులకు ఇంకా చెల్లించని జీతాలు..ఆందోళనలో ఎంప్లాయిస్
న్యూఢిల్లీ: టెలికాం రంగంలో ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి గట్టి పోటీ నెలకొనడంతో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లు కనిపిస్తున్నాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మరియు ఎంటీఎన్లో పనిచేస్తున్న 1.98లక్షల మంది ఉద్యోగస్తులకు జూలై నెలకు సంబంధించి జీతాలు ఇంకా చెల్లించలేదని యూనియన్ లీడర్ ఒకరు చెప్పారు.
ఇదిలా ఉంటే ఉద్యోగస్తులకు జీతాలను ఆగష్టు 5న చెల్లిస్తామని బీఎస్ఎన్ఎల్ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు. అయితే అలా జీతాలు చెల్లిస్తామని ఇప్పటి వరకు ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదని యూనియన్ నాయకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జూలై నెలకు సంబంధించిన జీతాలు ఇంకా రాలేదని దీనిపై సమాచారం కూడా లేదని యూనియన్ నాయకుడు అభిమన్యు తెలిపారు. ఇక ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేందుకు అంతర్గత సంపాదన నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ పీకే పుర్వార్ చెప్పారు.
ఇదిలా ఉంటే బీఎస్ఎన్ఎల్లో 1.76 లక్షల మంది ఉద్యోగస్తులు ఉండగా... ఎంటీఎన్ఎల్లో 22వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సాధారణంగా ఉద్యోగస్తుల జీతాలు ప్రతినెలా చివరిరోజున వారి వారి అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. అయితే ఈ సారి మాత్రం ఇంకా క్రెడిట్ కాకపోవడంతో ఉద్యోగస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇలా జరగడం ఇది రెండో సారి కావడంతో ఉద్యోగస్తుల్లో ఆ ఆందోళన తారాస్థాయికి చేరింది. ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య వరకు తమ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేదు బీఎస్ఎన్ఎల్ మరియు ఎంటీఎన్ఎల్. ఇందుకు కారణం అందులో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే అని తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ నెలవారీ జీతాల బిల్లు రూ. 750 కోట్లు నుంచి 850 కోట్ల మధ్య ఉంటుంది. ఎంటీఎన్ఎల్ బిల్లు రూ. 160 కోట్లుగా ఉంది.