జంగిల్ రాజ్ మరక, కాంగ్రెస్ పై ఉదాసీనత .. బీహార్ లో మహా కూటమి ఓటమికి కారణాలెన్నో!!
బీహార్లో ఎన్డీయే కూటమితో హోరాహోరీగా పోరాడిన మహాకూటమి పరాజయం పాలైంది. మొదటి ఫలితాల్లో ఆధిక్యాన్ని చూపించినా క్రమంగా కూటమి ప్రతికూల ఫలితాలను చవిచూసింది. చివరి వరకు గెలుస్తామని ధీమా చూపించిన మహా కూటమి నేతల ఓటమికి అనేక కారణాలు. ప్రధానంగా చూస్తే తేజస్వి యాదవ్ కు జంగిల్ రాజ్ మరక, కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న ఉదాసీనత, ఎన్నికల మేనిఫెస్టోలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ చేసిన ప్రకటనపై యువత పెద్దగా కనెక్ట్ కాలేకపోవడం, ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ, మహాకూటమితోపాటుగా ఎంఐఎం, బి ఎస్ పి , ఆర్ ఎల్ ఎస్ పి కలిసి గ్రాండ్ డెమోక్రాటిక్ సెక్యులర్ ఫ్రంట్ గా ఏర్పడడం వంటి కారణాలు బీహార్లో మహా ఘట్ బంధన్ కు చెక్ పెట్టాయి.
జంగిల్ రాజ్ మరక .. ప్రజల్లో ఆ భావన దూరం చెయ్యటంలో ఆర్జేడీ ఫెయిల్
బీహార్లో లాలూ రబ్రీదేవి పాలనను జంగిల్ రాజ్ అని సంబోధిస్తారు. ఆ కాలంలో కిడ్నాప్ లు, యువత అపహరణ పెద్దఎత్తున జరగడంతో వారి పాలనా కాలానికి ఆ ముద్ర పడింది . దీంతో ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ జంగిల్ రాజ్ వస్తుందంటూ ఎన్డీఏ చేసిన ప్రచారం ప్రజలలోకి బాగా వెళ్ళింది. ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఆ పార్టీకి సీట్లు పెరగకపోగా తగ్గినట్లుగా కనిపిస్తోంది. జంగిల్ రాజ్ మరకను తేజస్వి యాదవ్ బీహార్ ప్రజల మనసులో నుంచి పోగొట్టలేకపోవడమే ఓ కారణంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీపై ఉదాసీనత .. కూటమి కొంప ముంచిన కారణం
బీహార్లో తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆర్జెడి తో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ కు పొత్తులో భాగంగా 70 స్థానాలు కేటాయించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అత్యంత పేలవమైన ప్రదర్శన చూపించింది. కేవలం ఇరవై స్థానాలకే పరిమితమైంది. గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మరో 7 స్థానాలు కోల్పోయి మహా కూటమి విజయావకాశాలను దెబ్బ తీసినట్లు గా తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు గెలుచుకుంది. దీన్నిబట్టి బీహార్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉదాసీనంగా ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల వారి ఉదాసీనతనే మహా కూటమి కొంపముంచింది.
ఎన్నికల మ్యానిఫెస్టో ప్రభావం పెద్దగా లేదు
బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని, నిరుద్యోగ యువతకు 10 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. అయితే వ్యవసాయ చట్టాల రద్దు బీహార్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇక నిరుద్యోగ యువతకు పదిలక్షల ఉద్యోగావకాశాల విషయంలో తేజస్వి యాదవ్ ఇచ్చిన హామీలను యువత నమ్మలేదు. అందుకు కారణం తేజస్వి యాదవ్ పెద్దగా చదువుకోకపోవడం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Recommended Video
మహాకూటమి ఓటు బ్యాంకు చీల్చి తీరని నష్టం చేసిన ఎంఐఎం
బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ఓటమికి మరో కారణం కూడా కనిపిస్తుంది .ముఖ్యంగా ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయావకాశాలను దెబ్బ తీసినట్లుగా తెలుస్తోంది. ముస్లిం ఓటు బ్యాంకును చీల్చిన ఎంఐఎం పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. ఐదు స్థానాలను దక్కించుకుంది. ఆర్జేడీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు లో యాదవులు తో పాటు ముస్లింలు ఉన్నారు. ఈసారి మజ్లిస్ పార్టీ పోటీ చేయడంతో అది పలు స్థానాలలో ఆర్జెడి ఓటుబ్యాంకు చీల్చటమే కాకుండా, ఐదు స్థానాలను తమ ఖాతాలో వేసుకుని మహాకూటమికి ఘోరమైన దెబ్బకొట్టింది. ఇది మహాకూటమి ఊహించని పరిణామం. మొత్తానికి హోరాహోరీగా జరిగిన పోరులో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలకిందులు చేస్తూ బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పు మహాకూటమిని అధికారానికి దూరం చేయగా ఎన్డీఏకు అధికారం కట్టబెట్టి జోష్ ఇచ్చింది.