చర్చలకు సిద్ధమే.. కానీ షరతులు వర్తిస్తాయి..
కోల్కతా : జూనియర్ డాక్టర్లపై పేషెంట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో బెంగాల్లో వైద్య సేవలు స్తంభించాయి. వైద్యుల సమ్మెతో ఎమర్జెన్సీ కేసులు మినహా మిగతా రోగులు చికిత్స అందక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పట్టు వీడారు. మనసు మార్చుకుని వైద్యులతో చర్చలకు సిద్ధమయ్యారు. అటు జూనియర్ డాక్టర్లు సైతం మెట్టు దిగొచ్చారు. ముఖ్యమంత్రితో చర్చలకు రెడీగా ఉన్నామని ప్రకటించారు. అయితే చర్చలకు సంబంధించి షరతులు పెట్టారు.
ఒకవైపు వడగాలులు.. మరోవైపు మెదడువాపు రోగులు.. బీహార్లో పిట్టల్లా రాలుతున్న జనం.
బహిరంగ చర్చ
రోగుల బంధువుల నుంచి రక్షణ కోరుతూ తాము చేపట్టిన సమ్మెను రాజకీయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ఇది సీఎం ఇగో, తమ బతుకులకు మధ్య జరగుతున్న పోరాటమని అన్నారు. సీఎంతో చర్చలు ఎప్పుడు ఎక్కడ అనే విషయం తామే నిర్ణయిస్తామని చెప్పారు. ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు తమవైపునే ఉన్నందున తామంతా కలిసి చర్చించుకుని వేదికను నిర్ణయిస్తామని చెప్పారు. నాలుగ్గోడల మధ్య కాకుండా మీడియా ఎదుట బహిరంగంగా సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని జూడాలు స్పష్టం చేశారు.
దీదీని దూషించలేదు
సీఎం మమత బెనర్జీని జూనియర్ డాక్టర్లు దూషించారన్న విషయంలో నిజం లేదని జూడాలు అంటున్నారు. తమ సహోద్యోగిపై ప్లాన్ ప్రకారం దాడి జరిగిందని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం తాము చేప్టటిన పోరాటం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందన్న విషయం తెలుసని, అందుకు వారిని క్షమాపణలు కోరుతున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే బెంగాల్ జూనియర్ డాక్టర్లకు సంఘీభావం తెలుపుతూ జమ్మూ, అసోం రాష్ట్రాలకు చెందిన వైద్యులు ఆందోళనల్లో పాల్గొన్నారు.
రోగి మరణంతో జూడాలపై దాడి
కోల్కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న రోగి గత సోమవారం చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యమే అందుకు కారణమని మృతుని బంధువు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్లపై దాడి చేశారు.ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఈ క్రమంలో సమ్మె విరమించి డాక్టర్లు వెంటనే విధుల్లోకి హాజరుకావాలని దీదీ అల్టిమేటం జారీ చేశారు. జూడాలు వెనక్కి తగ్గకపోవడంతో కోల్కతా హై కోర్టును ఆశ్రయించారు. అయితే సమ్మెపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో దీదీ డాక్టర్లతో చర్చలకు సిద్ధమయ్యారు.