ఐదుగురిలో ఒకరు! ముద్ర యోజనతో కోటి మందికిపైగా ఉపాధి: ప్రభుత్వ సర్వే
న్యూఢిల్లీ: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర యోజన సత్ ఫలితాలను ఇస్తోందని కార్మిక శాఖ వెల్లడించింది. ప్రతీ ఐదుగురిలో ఒకరు(20.6శాతం) ముద్ర యోజన ద్వారా స్వయం ఉపాధిని పొందారని కార్మిక శాఖ నిర్వహించిన సర్వేలో తేలింది.
నిరుద్యోగ యువత స్వయం ఉపాధి నెలకొల్పేందుకు ముద్ర యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 2015-డిసెంబర్ 2017 మధ్య కాలంలో 1.12కోట్ల మంది యువత ముద్ర యోజన అందించిన రుణాల ద్వారా ఉపాధిని పొందారని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వశాఖ ఆధీనంలోని లేబర్ బ్యూరో జరిపిన ప్రధాన్ మంత్రి ముద్ర యోజన సర్వేలో వెల్లడైంది. పథకం ప్రారంభించిన 33 నెలల్లోనే ఈ ఫలితాలు సాధించినట్లు తేలింది. ఈ మేరకు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ముద్ర యోజన ద్వారా 51.06లక్షల మంది స్వయం ఉపాధిని పొందారని, మరో 60.94లక్షల మందికి ఉపాధి కల్పించారని సర్వేలో వెల్లడైంది. మార్చి 27, 2019 తేదీతో విడుదలైన డ్రాఫ్ట్ను ది ఇండియన్ ఎక్స్ప్రెస్ యాక్సెస్ చేసింది. ఏప్రిల్-నవంబర్ 2018 మధ్య కాలంలో 97వేల మంది లబ్ధి పొందారని సర్వేలో తేలింది.
ముద్రలోని శిశు, కిషోర్, తరుణ్ మూడు కేటగిరిల్లో రూ. 5.71కోట్లు మంజూరు చేయబడ్డాయి. మొదటి మూడేళ్లలో 12.27 కోట్ల లోన్ ఖాతాలతో ఈ మొత్తాన్ని ఇవ్వడం జరిగింది. సగటు లోన్ పరిమితి రూ. 46.536గా ఉంది.
2017-18లో శిశు లోన్స్(రూ. 50వేల లోపు) ఖాతా 42శాతం రుణ మొత్తం విడుదలైంది. కిషోర్ (రూ. 50వేల నుంచి 5లక్షల వరకు)లో 34శాతం నిధులు విడుదల చేయబడ్డాయి. తరుణ్ (రూ. 5లక్షల నుంచి 10లక్షల వరకు)లో 24శాతం నిధులు ఉపయోగించారు. శిశు లోన్స్ 66శాతం కొత్త ఉద్యోగాలను సృష్టించగా. కిశోర్ ద్వారా 18.85శాతం కొత్త ఉద్యోగాలు, తరుణ్ ద్వారా 15.51శాతం ఉద్యోగాలు కొత్తగా వచ్చాయని సర్వే వివరించింది.
రూ. 5.1లక్షల పెట్టుబడి ఒక అదనపు ఉద్యోగాన్ని కల్పిస్తోందని తెలిపింది. సర్వీసు రంగంలో 38.46లక్షలు లేదా 34.34శాతం, ట్రేడింగ్లో 37.21 లక్షలు లేదా 33.23శాతం ఉద్యోగాలు పొందారు. వ్యవసాయ సంబంధిత రంగంలో 22.77లక్షల ఎక్కువ ఉద్యోగాలు(మొత్తంలో 20.33శాతం), తయారీ రంగంలో 13.10లక్షలు(11.17శాతం) ఉద్యోగ కల్పన జరిగింది.