మరికొద్ది నిమిషాల్లో విమానం టేకాఫ్ అనగా... షాకింగ్ విషయం చెప్పిన ప్రయాణికుడు...
మరికొద్ది నిమిషాల్లో ఇక విమానం గాల్లో ఎగురుతుందనగా ఓ ప్రయాణికుడు బాంబు లాంటి వార్త చెప్పాడు. తనకు కోవిడ్ 19 పాజిటివ్గా నిర్దారణ అయిందని... ఇప్పుడే సెల్ఫోన్కు మెసేజ్ వచ్చిందని చెప్పాడు. దీంతో షాక్ తిన్న విమాన సిబ్బంది వెంటనే అతన్ని కిందకు దించేశారు. ఆ తర్వాత మిగతా ప్రయాణికులను కూడా కిందకు దించి విమానం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గురువారం(మార్చి 4) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ విమానం పుణే వెళ్లాల్సి ఉంది. అప్పటికే టేకాఫ్కి ఇక అంతా సిద్దమైంది.ఇంతలో ఓ ప్రయాణికుడు తనకు కోవిడ్ 19 పాజిటివ్గా తేలినట్లు చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. అయినప్పటికీ విమాన సిబ్బంది ఆ పరిస్థితిని జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ఎవరూ భయాందోళన చెందవద్దని ప్రయాణికులకు చెప్పారు.
పైలట్ వెంటనే విమానాన్ని మళ్లీ పార్కింగ్ బే ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. ఆపై ఆ ప్రయాణికుడిని కిందకు దింపి ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం అతన్ని ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.మిగతా ప్రయాణికులను కూడా కిందకు దించి విమానం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. దీంతో విమానం షెడ్యూల్ కన్నా రెండు గంటలు ఆలస్యంగా పుణే బయలుదేరింది.
కాగా,ప్రస్తుతం మహారాష్ట్రలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం(మార్చి 5) ఒక్కరోజే కొత్తగా 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,98,399కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 88,838 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 312 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు. మొత్తంగా గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 16,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761కి చేరింది. గడిచిన 24గంటల్లో మరో 113 మంది కరోనాతో మరణించగా.. ఇప్పటివరకూ 1,57,548 మంది కరోనాతో మృతి చెందారు. ఇటీవలే దేశంలో రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటివరకూ 17.14లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.