క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరించిన కాసేపటికే క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసిన నిర్భయ నిందితుడు
న్యూఢిల్లీ: నిర్భయ నిందితులకు ఉరి అమలు చేసేందుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండగా నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో చివరినిమిషం ప్రయత్నాల్లో భాగంగా నిందితుడు పవన్ గుప్తా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. నిర్భయ కేసు నిందితుడు పవన్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన గంటలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు మరోసారి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు.
అంతకుముందు తనకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు పవన్ గుప్తా. నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ను అంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే పవన్ తరపున లాయర్ ఏపీ సింగ్ ఆదివారం రోజున సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద పిటిషన్ దరఖాస్తు చేశారు.
ఇదిలా ఉంటే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వారిలో పవన్ గుప్తా చివరివాడు. ఇక ఉన్న చివరి అస్త్రంను ప్రయోగించినప్పటికీ సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఇక మిగతా ముగ్గిరితో పాటు పవన్గుప్తాకు కూడా ఉరిశిక్ష అమలు కానుంది. నిర్భయ ఘటన జరిగిన రోజునాటికి తన వయస్సు 16 ఏళ్లు రెండు నెలలని అది తన స్కూలు రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుందంటూ తన పిటిషన్లో పేర్కొన్నాడు. అంతేకాదు జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం తన వయస్సును పరిగణలోకి తీసుకోలేదని వెల్లడించాడు. విచారణ సందర్భంగా ఈ అంశాన్ని విచారణాధికారులు పరిగణలోకి తీసుకోలేదని పవన్ పిటిషన్లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే తనకు అందుబాటులో ఉన్న లీగల్ పరమైన అవకాశాలను వినియోగించుకోవడంలో పవన్ చివరివాడు. గతంలో పవన్ గుప్తా రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ ఫైల్ చేయగా దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. దీంతో తాజాగా మరో క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతికి పెట్టుకున్నాడు.
ఇదిలా ఉంటే తమకు విధించిన డెత్వారెంట్పై స్టే ఇవ్వాలని కోరుతూ పవన్ కుమార్ గుప్తాతో పాటు మరో నిందితుడు అక్షయ్ సింగ్లు ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి వద్ద తాను క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినందున డెత్ వారెంట్పై స్టే ఇవ్వాలని అక్షయ్ సింగ్ కోరాడు. అదే సమయంలో తాను క్యూరేటివ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినందున తన డెత్ వారెంట్పై స్టే ఇవ్వాలని ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు పవన్ కుమార్ గుప్తా.
ఇదిలా ఉంటే మార్చి3వ తేదీన నిర్భయ ఘటనలో నిందితులకు ఉరి శిక్ష విధించాలని ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17న తీర్పు వెల్లడించింది. ఇప్పటికే ముఖేష్, వినయ్, అక్షయ్ సింగ్లు రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా రామ్నాథ్ కోవింద్ వాటిని తిరస్కరించారు. తాజాగా పవన్ కుమార్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిషన్ కూడా తిరస్కరించడంతో ఇక నిర్భయ ఘటనలో నిందితులకు మార్చి 3వ తేదీన ఉరిశిక్ష అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.