సంఖ్యా బలం ఉందని విర్రవీగరాదు: బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు, దిలీప్కు కౌంటర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సీఏఏ పై ఆ రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలు ఆందోళనల నేపథ్యంలో బీజేపీ నేతల మధ్య విబేధాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది. దేశంలోకి అక్రమంగా చొరబడిన 50 లక్షల మంది ముస్లింలను దేశం నుంచి తరిమివేస్తామని పశ్చిమ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్ర కుమార్ బోస్ భిన్న స్వరం వినిపించారు. అధికారం, సంఖ్యాబలం ఉందికదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడరాదని హితవు పలికారు. దేశంలో ఉగ్రరాజకీయాలకు తావు లేదన్నారు.
బీజేపీకి సంఖ్యాబలం, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడరాదని ఆయన సూచించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సరైనదే అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి తప్పితే అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అది మరింత రచ్చకు దారి తీస్తుందని అన్నారు చంద్రకుమార్ బోస్. సీఏఏ వల్ల కలిగే లబ్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచిచూడాలి తప్పితే ప్రజాస్వామ్యంలో ఒక చట్టం తీసుకొచ్చి అది పౌరుల మీద బలవంతంగా రుద్దడం కూడా సరికాదని స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టంపై చిన్నపాటి మార్పులు చేస్తే ఈ ఆందోళనలు నిరసనలు తగ్గిపోతాయని తాను ప్రభుత్వానికి సూచించినట్లు చంద్రకుమార్ బోస్ చెప్పారు. ముస్లిం మెజార్టీ దేశాల్లో అణిచివేతకు గురైన మైనార్టీలకు మాత్రమే భారత పౌరసత్వం కల్పిస్తామని చట్టంలో పేర్కొని ఉంటే బాగుండేదని తాను సూచించినట్లు చంద్రకుమార్ బోస్ తెలిపారు. ఫలానా మతం వారికి మాత్రమే భారతపౌరసత్వం కల్పిస్తున్నట్లు చట్టంలో పొందుపర్చడంతోనే దేశవ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు రేకెత్తాయని ఆయన గుర్తు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తున్న వారిని కుక్కలను కాల్చినట్లు కాల్చాలని వారంతా దెయ్యాలు అని గతవారం బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అయితే బోస్ వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని ఎలాగైతే కాల్చి చంపారో అలానే కాల్చేయాలని దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే కౌంటర్గా అదే బీజేపీ పార్టీకి చెందిన చంద్రకుమార్ బోస్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.