జయలలితకు చికిత్స: రికార్డులు మొత్తం ఇవ్వండి, అపోలో ఆసుపత్రికి ఆదేశాలు!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఇప్పుడు అపోలో ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులను విచారించడానికి సిద్దం అయ్యింది. జయలలిత చికిత్స వివరాలు, మెడికల్ రికార్డులు మొత్తం ఇవ్వాలని అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు.
Recommended Video
75 రోజులు ఏం జరిగింది ?
2016 సెప్టెంబర్ 22వ తేదీ అర్దరాత్రి నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు 75 రోజులకు పైగా అపోలో ఆసుపత్రిలో జయలలితకు ఎలాంటి చికిత్స చేశారు. వాటి పూర్తి వివరాలు ఉన్న మెడికల్ రికార్డులు తీసుకువచ్చి సమర్పించాలని బుధవారం ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఆపోలో ఆసుపత్రి యాజమాన్యానికి సూచించింది.
అపస్మారకస్థితిలో !
2016 సెప్టెంబర్ 22వ తేదీ అర్దరాత్రి జయలలిత అపస్మారకస్థితిలో అపోలో ఆసుపత్రిలో చేరారని అనేక మంది ఆరోపించారు. జయలలిత జ్వరంతో ఆసుపత్రిలో చేరారని అప్పట్లో అపోలో ఆసుపత్రి వర్గాలు మీడియాకు ప్రకటనలు విడుదల చేశాయి.
ఇడ్లీ, ఉప్మా అన్నారు !
జయలలితకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారని, అమ్మ కొలుకుంటున్నారని, ఆమె ఇడ్లీ, ఉప్మా తిన్నారని, జ్యూస్ తాగారని అనేక మంది మంత్రులు అప్పట్లో మీడియాకు చెప్పారు. ఇప్పుడే అమ్మ జయలలితను చూసి వస్తున్నామని అన్నాడీఎంకే ప్రముఖులు మీడియా ముందు మాయమాటలు చెప్పారు.
ఫోటో కూడా రాలేదు
జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఒక్క ఫోటో విడుదల చెయ్యాలని తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా అమ్మ అభిమానులు డిమాండ్ చేశారు. అయితే అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స చేస్తున్న సమయంలో తీసిన ఒక్క ఫోటో కూడా విడుదల చెయ్యలేదు.
శశికళ మీద ఆరోపణలు
అపోలో ఆసుపత్రిలో జయలలిత దగ్గర శశికళ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని, ఆసుపత్రిలోని అమ్మ గదిలోకి ఎవ్వరినీ అనుమతించలేదని ఆరోపణలు ఉన్నాయి. శశికళ కుటుంబ సభ్యులు దాడి చెయ్యడం వలనే జయలలిత అనారోగ్యానికి గురైనారని ఆరోపణలు ఉన్నాయి.
చికిత్స విఫలమై !
2016 డిసెంబర్ 5వ తేదీ పొద్దుపోయిన తరువాత జయలలిత చికిత్స విఫలమై మరణించారని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. అప్పటి నుంచి శశికళ మీద అనేక అనుమానాలు ఉన్నాయని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు అనేక మంది ఆరోపణలు చేశారు.
అమ్మ వీడియో
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్బంగా టీటీవీ దినకరన్ మద్దతుదారుడు, అన్నాడీఎంకే పార్టీ అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో విడుదల చేశారు. అనంతరం వెట్రివేల్ తో సహ టీటీవీ దినకరన్, శశికళ, ఆమె మేనకోడులు క్రిష్ణప్రియకు విచారణకు హాజరుకావాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సమన్లు జారీ చేసింది.
అపోలో ఆసుపత్రి
జయలలితకు ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స అందించారు ? వాటి వివరాలు ఏమిటి ? ఆమె మరణానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి ? అనే పూర్తి సమాచారం ఉన్న రికార్డులు జనవరి 12వ తేదీలోపు సమర్పించాలని బుధవారం ఆర్ముగస్వామి విచారణ కమిషన్ అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.