సారీ, ఎగతాళి చేశారు.. నా మానసిక స్థితి వల్లే: జడ్జి
చెన్నై: వివాదాస్పద జడ్జి కర్ణన్ మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తికి క్షమాపణ లేఖ పంపించారు. తన మానసిక పరిస్థితి బాగాలేదని, ఈ నేపథ్యంలోనే తప్పుడు ఆదేశాలు పంపానని చీఫ్ జస్టిస్ కెఎస్ కెహర్,జస్టిస్ ఆర్ భానుమతిలకు తెలిపారు.
కొందరు సహచర న్యాయమూర్తులు ఎగతాళి చేయడంతో మానసికంగా కుంగిపోయానని జడ్జి కర్ణన్ అందులో పేర్కొన్నారు. అయితే, ఎగతాళి చేసిన న్యాయమూర్తులు ఎవరు అనే విషయాన్ని ఆయన వెల్లడించ లేదు.
భారత దేశ న్యాయవ్యవస్థలో ఇటీవలి కాలంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఘటనలు పది రోజుల క్రితం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల్ని హైకోర్టు జడ్జి కర్ణన్ నిలిపివేయడమే కాకుండా తన పరిధిలో జోక్యం చేసుకోవద్దని, తనకు వివరణ ఇవ్వాలని ఏకంగా సిజెఐకే సూచించారు.
ఆ తర్వాత ఆ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఢిల్లీ, చెన్నై మధ్య పలుపరిణామాలు వేగంగా సంభవించాయి. మద్రాస్ హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ స్ఎస్ కర్ణన్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయటానికి సంబంధించిన ప్రతిపాదనపై సిజెఐ ఈ నెల 12న ఆదేశాలు జారీ చేశారు.
దీనిని జస్టిస్ కర్ణన్ సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టనున్నారన్న సమాచారంతో.. మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్తో పాటు ప్రముఖ లాయర్ వేణుగోపాల్ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై అప్పుడు విచారణ చేపట్టిన జస్టిస్ కెఎస్ ఖేహర్, జస్టిస్ భానుమతితో కూడిన ధర్మాసనం... జస్టిస్ కర్ణన్కు ఎటువంటి వ్యవహారాలు అప్పగించవద్దని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ను ఆదేశించింది.
ఇది పది రోజుల క్రితం చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ కర్ణన్ మరోసారి తెరపైకి వచ్చారు. తన మానసిక పరిస్థితి బాగా లేదని, అందుకే తప్పుడు ఆదేశాలు ఇచ్చానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
వివిధ సంఘటనలతో కలత చెంది మానసికంగా నిస్పృహకు గురయ్యాయని, ఫలితంగా మానసికంగా సంతులనం కోల్పోయి తప్పుడు ఉత్తర్వులు ఇచ్చానని ఆ లేఖలో పేర్కొన్నారు. తనను వేధింపులకు గురి చేసిన రెండు సందర్భాలను జస్టిస్ కర్ణన్ ఈ లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయమై మూడేళ్ల క్రితం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్కు ఫిర్యాదు చేశానని తెలిపారు. తనను అవహేళన చేసిన న్యాయమూర్తుల పేర్లు వెల్లడించాలని అప్పట్లో మీడియా కోరిందని, అయితే న్యాయవ్యవస్థ పవిత్రత కాపాడాలన్న ఉద్దేశంతో తాను నిరాకరించానని లేఖలో తెలిపారు.