ఎట్టకేలకు చిక్కిన మాజీ న్యాయమూర్తి కర్ణన్, కోయంబత్తూరులో అరెస్ట్, కోల్కతాకు తరలింపు
కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. మంగళవారం ఆయనను తమిళనాడులోని కోయంబత్తూరులో పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
కోయంబత్తూరు : కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. మంగళవారం ఆయనను తమిళనాడులోని కోయంబత్తూరులో పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కర్ణన్ తరఫు న్యాయవాది పీటర్ రమేష్ వెల్లడించారు. బుధవారం కర్ణన్ను పోలీసులు కోల్కతా తరలించనున్నారు.
కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన కర్నన్ న్యాయవ్యవస్థలో అవినీతిని ప్రస్తావించి వివాదానికి కారణమయ్యారు. దీనిపై సుప్రీం కోర్టు ఆయనకు పలుమార్లు సమన్లు జారీ చేయగా తిరిగి న్యాయమూర్తులకే సమన్లు జారీ చేయడంతో పాటు వారిని అరెస్టు చేయాలని కూడా ఆదేశించి మరింత వివాదస్పదమయ్యారు.
కోర్టు ధిక్కారం నేరంపై సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష నుంచి జస్టిస్ కర్ణన్ తప్పించుకు తిరుగుతున్నారు. మే9న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్ను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటి నుంచి ఆయన అదృశ్యమయ్యారు.
అంతేకాదు, అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన తొలి న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో కర్ణన్ నిలిచిపోయారు. పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న న్యాయమూర్తి కూడా ఈయనే.
జైలు శిక్షపై స్టే కోసం సుప్రీం సెలవు కాల ధర్మాసనానికి ఆయన పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఊరట లభించలేదు. కోర్టు ధిక్కారనేరంపై తనను శిక్షించడం కుదరదని, తీర్పును రద్దు చేయాలని, తదుపరి విచారణపై స్టే విధించాలని మే 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలని కర్ణన్ తరఫు న్యాయవాదులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. మరోవైపు కర్ణన్ అరెస్టుకు సహకరించాలని కోరుతూ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్కు పశ్చిమ బెంగాల్ డీజీపీ గత సోమవారం లేఖ రాసిన విషయం తెలిసిందే.