జస్టిస్ కర్ణన్ రాజకీయ పార్టీ: ఎలా ఉండబోతుందో కూడా చెప్పేశారు?
కోల్ కతా: జైలు నుంచి విడుదలైన ఐదు నెలల అనంతరం రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు రిటైర్డ్ జస్టిస్ కర్ణన్. త్వరలోనే 'యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ' పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించబోతున్నట్టు బుధవారం ఆయన ప్రకటించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తుందని చెప్పిన కర్ణన్.. అన్ని స్థానాల్లోనూ మహిళలనే బరిలోకి దింపనున్నట్టు చెప్పడం గమనార్హం.
నన్ను వారణాసి పోటీ చేయమన్నారు.. కానీ
'వ్యవస్థాపక సభ్యుని హోదాలో నేను పార్టీని స్థాపించాను. మహిళలు మాత్రమే పార్టీ తరుపున పోటీ చేస్తారు. దేశంలో అన్ని స్థానాలను మేమే గెలుచుకోగలమన్న నమ్మకం ఉంది. పార్టీ నుంచి నన్ను కూడా పోటీ చేయమని అడుగుతున్నారు. వారణాసి నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు.
కానీ అక్కడినుంచి కూడా మహిళనే పోటికి దింపుతాం. మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష కారణంగానే అన్ని స్థానాలను వారితోనే పోటీ చేయాలని నిర్ణయించాం. న్యాయ వ్యవస్థలో కొనసాగే ఆలోచన నాకు ఇక ఎంతమాత్రం లేదు' ని కర్ణన్ పేర్కొన్నారు.
ఏడాదికో ప్రధాని
అంతేకాదు, ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే.. మొత్తం ఐదేళ్ల పదవీకాలానికి గాను ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరికి ప్రధానిగా అవకాశం ఇస్తామన్నారు. '2019-20లో ఒక ముస్లిం మహిళ దేశానికి ప్రధాని కావాలి. ఆ తర్వాత ఓ అగ్రకుల మహిళ.' అని చెప్పుకొచ్చారు.
మైనారిటీలపై పెరుగుతున్న హింస అంతర్జాతీయ సమాజానికి మనదేశాన్ని తక్కువ చేసి చూపిస్తోందన్నారు కర్ణన్. కాబట్టి డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగంతో ఇలాంటి వాటిని అరికట్టి అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పారు.
వాళ్లను విడుదల చేస్తాం..
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేయబోయే రెండో ఎజెండా గురించి కూడా కర్ణన్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్, బెంగాల్ పీసీపీఏ ఛత్రధర్ మహాతోను తక్షణం విడుదల చేస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థను ఒకటే అర్జిస్తున్నానని అమాయకులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్నెళ్ల జైలు శిక్ష అనంతరం
కర్ణన్ గతంలో కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేసినందుకు గాను ఆయన ఆర్నెళ్ల జైలు శిక్ష కూడా అనుభవించారు. జైలు నుంచి వచ్చిన అనంతరం ఆయన చేసిన మొట్టమొదటి పబ్లిక్ స్టేట్ మెంట్ పార్టీ గురించే కావడం గమనార్హం.