ఉవ్వెత్తున ‘దిశ’ నిరసన: జంతర్ మంతర్ వద్ద రేవంత్ రెడ్డి ధర్నా.. చేతకాకపోతే ప్రజలే శిక్ష...
దేశవ్యాప్తంగా సంచలన రేపిన దిశ హత్యా ఘటన పార్లమెంట్నే కాకుండా దేశాన్ని కుదిపేస్తున్నది. ఈ ఘోర ఘటనపై పలు ఎంపీలు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సభలో ఈ ఘటనపై స్పందిస్తూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా జయబచ్చన్, ఏఐడీఎంకే, రక్షణ మంత్రి రాజ్నాథ్ ఈ ఘటనపై స్పందించారు. వివరాల్లోకి వెళితే..
యూత్ కాంగ్రెస్ ధర్నాలో రేవంత్ రెడ్డి
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యూత్ కాంగ్రెస్ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో మహిళలపై హింసను వ్యతిరేకిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యం వల్లనే దిశ దుర్ఘటన చోటచేసుకొన్నది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆల్ ఇండియా ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా), ఆలిండియా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తదితరు పాల్గొన్నారు.
చేతకాకపోతే.. జయబచ్చన్
దిశ ఘటనపై పార్లమెంట్ వద్ద మీడియాతో ఎంపీ జయాబచన్ మాట్లాడుతూ.. ఒకవేళ మహిళలకు భద్రత కల్పించడం చేతకాకపోతే, ప్రజలకు వదిలేయండి.. వారే తగిన తీర్పు ఇస్తారు. రక్షణ కల్పించని వారిని, దోషులను పబ్లిక్కు అప్పగించాలి. వారికి తమ తీర్పుతో ప్రజలే శిక్ష విధిస్తారు అని జయబచ్చన్ అన్నారు.
31లోపు ఉరి తీయాలి.. ఏఐఏడీఎంకే
దిశ ఘటనపై ఏఐడీఎంకేకు చెందిన రాజ్యసభ ఎంపీ విజిలా సత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో దిశను దారుణంగా రేప్ చేసి చంపేసిన నలుగురు నిందితులను డిసెంబర్ 31లోపు ఉరి తీయాలి అని భావోద్వేగానికి గురయ్యారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. తీర్పు ఆలస్యమైతే న్యాయం దూరమైనట్టే అని అన్నారు.
రాజ్నాథ్ స్పందన
మహిళలపై జరుగుతున్న దారుణాలను నిరోధించడానికి కఠిన చట్టాలు రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని వర్గాలతో చర్చలు జరపడానికి సర్కార్ ఎల్లప్పుడూ ఓపెన్. అన్ని పార్టీలు, వర్గాలు సహకరిస్తే కఠినమైన చట్టాలు అమలు చేయడానికి ఎల్లప్పుడు సిద్ధమే అని లోక్సభలో రాజ్నాథ్ ప్రకటన చేశారు.