సీజేఐపై కేసులో జస్టిస్ రమణ స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రా..
ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ ఎన్వీ రమణ వైదొలగడంతో ఆ స్థానాన్ని జస్టిస్ ఇందూ మల్హోత్రాతో భర్తీ చేశారు. ఈ మేరకు జస్టిస్ ఎస్ఏ బాబ్జే గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆరోపణలు చేసిన మహిళ అభ్యంతరాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీజేఐపై ఆరోపణలపై విచారణ జరుపుతున్న ధర్మాసనంలో ఎన్వీ రమణకు చోటు కల్పించడంపై ఆరోపణలు చేసిన మహిళ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కు జస్టిస్ ఎన్వీ రమణకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నందున కేసు విచారణపై అది ప్రభావం చూపుతుందని ఆమె ఆరోపించింది.
సీజేఐపై కుట్ర విచారణకు సుప్రీం కమిటీ
దీంతో పాటు ప్యానెల్లో మహిళా జడ్జి జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు మహిళ త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎస్.ఏ. బోబ్డేకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ కేసు విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రాను నియమిస్తూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఉత్తర్వులు జారీ చేశారు.