ఏపీ, తెలంగాణ జడ్జీల కేటాయింపుల కేసులో అనూహ్య పరిణామం!
రెండు తెలుగు రాష్ట్రాల జడ్జీల, న్యాయాధికారుల కేటాయింపుపై తెలంగాణ న్యాయమూర్తుల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ జాస్తి చలమేశ్వర్,
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ న్యాయమూర్తుల, న్యాయాధికారుల కేటాయింపుల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రకటించారు. పిటిషన్ను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల జడ్జీల, న్యాయాధికారుల కేటాయింపుపై తెలంగాణ న్యాయమూర్తుల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎస్ అబ్దుల్నజీర్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే.
గత మూడు వారాలుగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సీరియస్గా వాదనలు విన్నారు. హఠాత్తుగా కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించడం రెండు రాష్ట్రాల న్యాయవాదులకు కొంత ఆశ్చర్యం కలిగించింది.
ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహించిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్.. అనంతరం అక్కడే న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం ఆయన సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వెళ్లారు. ఈ కేసు విచారణ సమయంలో పలుమార్లు ఉమ్మడి హైకోర్టుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని జస్టిస్ చలమేశ్వర్ గుర్తు చేసుకున్నారు.
సుప్రీంకోర్టులో దాఖలైన ఈ కేసులో ఆయన జనవరి 23 నుంచి వాదనలు వింటున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య జడ్జీల విభజన భావోద్వేగంతో ముడిపడిన అంశమని పలుమార్లు పేర్కొన్నారు. నిజానికి ఈ కేసును ఆయన విచారించడం తెలంగాణ న్యాయమూర్తుల సమాఖ్యతో పాటు అందరికీ సమ్మతం అని తెలియజేసిన తరువాతే... విచారణ ప్రారంభించారు.
ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టులో జరిగిన వాదనల్లో ఏపీ తరపున సీనియర్ న్యాయవాది వివిఎస్ రావు వాదనలు వినిపించారు. అంతకుముందు తెలంగాణ జడ్జీల సమాఖ్య తరపు న్యాయవాది ఇందిరాజైసింగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హరీన్రావెల్, ఉమ్మడి హైకోర్టు తరపున న్యాయవాది వెంకట రమణీరావు తదితరుల వాదనలను మూడు వారాలుగా విన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జడ్జీల విభజనకు కేంద్రం మార్గదర్శకాలు సైతం రూపొందించింది. అయితే ఆ మార్గదర్శకాలను ఉమ్మడి హైకోర్టు సవరించింది. స్థానికత ప్రకారం కేటాయింపులు జరపాలని కేంద్రం పేర్కొనగా.. సీనియార్టీ ప్రకారం ఆప్షన్ ఇవ్వాలని ఉమ్మడి హైకోర్టు సవరణ చేసింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది.
కేసు విచారణ సమయంలోనూ కోర్టు హాల్లో ఇరుపక్షాలు వ్యక్తిగత వాదనలు చేసుకున్న సమయంలోనూ పలుమార్లు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వారించారు. ఈ కేసులో ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎవరికీ నష్టం కలగకూడదన్న అభిప్రాయాన్ని పలుమార్లు వ్యక్తపరిచారు.
ఇప్పుడు ఉన్నట్లుండి ఈ కేసు విచారణలోంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తాజా నిర్ణయంతో కేసు విచారణ మరో ధర్మాసనానికి బదిలీకానుంది.