నేడు పదవీవిరమణ చేయనున్న తెలుగు తేజం జస్టిస్ జాస్తి చలమేశ్వర్
సుప్రీంకోర్టు జడ్జిగా ఏడేళ్ల పాటు సేవలందించిన తెలుగు తేజం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శుక్రవారం పదవీవిరమణ చేయనున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే జాస్తి చలమేశ్వర్ ఈ మధ్యే సుప్రీంకోర్టు పనితీరును తప్పుబడుతూ మిగతా ముగ్గురు జడ్జీలతో కలిసి తిరుగుబావుట జెండా ఎగురవేసి వార్తల్లో నిలిచారు.
ఈ ఏడాది జనవరి 12న సుప్రీంకోర్టు పనితీరుపై జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లతో కలసి ఆయన లేవనెత్తిన ప్రశ్నలు దేశాన్ని కుదిపేశాయి. తొలిసారిగా ఇలా జడ్జీలు మీడియా సమావేశం నిర్వహించి ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేయడం దేశ న్యాయ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. జస్టిస్ చలమేశ్వర్ ఈ రోజుతో 65వ ఏటాలోకి అడుగుపెట్టారు.
వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అంటూ చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో ఆయన కూడా సభ్యుడు కావడం విశేషం. ఈ తీర్పుతో పాటు మరెన్నో సంచలనమైన తీర్పులను జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఇచ్చారు.
సుప్రీంకోర్టు ఎలాంటి తారతమ్యాలు లేకుండా బేషజాలకు పోకుండా తటస్థంగా ఉంటేనే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ చట్టాన్ని రద్దు చేసిన జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఒక జడ్జిగా ఉన్న చలమేశ్వర్... ఆ నిర్ణయంతో విబేధించారు.
1953లో జనవరి 23న ఏపీలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జన్మించారు. కృష్ణా జిల్లా మోవ్య మండలం పెద్ద ముత్తేవి ఆయస సొంత ఊరు. ప్రాథమిక ఉన్నత పాఠశాల చదువును మచిలీపట్నంలో పూర్తి చేశారు. అనంతరం మద్రాస్లోని లయోలా కాలేజీ నుంచి ఫిజిక్స్లో డిగ్రీ పూర్తి చేశారు. 1976లో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించబడ్డారు. 1997లో ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా 1999 వరకు సేవలందించారు.2007 మే 3న జస్టిస్ చలమేశ్వర్ గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2010 మార్చి 17న బాధ్యతలు స్వీకరించారు.2011 అక్టోబర్ 10న సుప్రీం కోర్టు జడ్జిగా జస్టిస్ చలమేశ్వర్ బాధ్యతలు చేపట్టారు.